తక్కువ దూరాలకు రైలు చార్జీలు రెట్టింపు
ABN , First Publish Date - 2021-02-25T07:10:01+05:30 IST
తక్కువ దూరాలకు ప్రయాణాలను నిరుత్సాహ పరిచే ఉద్దేశంతో రైలు చార్జీలను ‘కొద్దిగా’ పెంచామని రైల్వే శాఖ
అనవసర ప్రయాణాలను తగ్గించేందుకే!: రైల్వే శాఖ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: తక్కువ దూరాలకు ప్రయాణాలను నిరుత్సాహ పరిచే ఉద్దేశంతో రైలు చార్జీలను ‘కొద్దిగా’ పెంచామని రైల్వే శాఖ ప్రకటించింది. ‘కొద్దిగా’ అని ఆ శాఖ చెబుతున్నా.. పెంపుదల భారీగానే ఉంది. ఉదాహరణకు.. అమృత్సర్ నుంచి పఠాన్కోట్ (107 కిలోమీటర్లు) వెళ్లడానికి సెకండ్ సీటింగ్ రిజర్వుడు టికెట్ ధరను రూ.25 నుంచి రూ.55కు పెంచారు.
అలాగే, జలంధర్ సిటీ నుంచి ఫిరోజ్పూర్కు(118 కిలోమీటర్లు) రూ.30గా ఉన్న పాసింజర్ డీఎంయూ ట్రైన్ టికెట్ ధరను రూ.60కి పెంచేశారు. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. అనవసర ప్రయాణాలను నిరుత్సాహపరిచేందుకే చార్జీలను పెంచారు. ఇక ఎక్కువ దూరాలకు ప్రయాణించే రైలు టికెట్లపైనా 10-30ు అదనంగా వసూలు చేస్తున్నారు.