డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే వేగవంతమైన వృద్ధి: మోదీ

ABN , First Publish Date - 2021-12-07T20:01:47+05:30 IST

జోడు ఇంజన్ల ప్రభుత్వంతో (కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం) అభివృద్ధి వేగవంతమవుతుందని..

డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే వేగవంతమైన వృద్ధి: మోదీ

గోరఖ్‌పూర్: జోడు ఇంజన్ల ప్రభుత్వంతో (కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం) అభివృద్ధి వేగవంతమవుతుందని, గోరక్‌పూర్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులే 'నవీన భారతం' (న్యూ ఇండియా) నిర్మాణం ఏమాత్రం అసాధ్యం కాదనే విషయాన్ని చాటుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లో రూ.10,000  కోట్ల విలువైన మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మంగళవారంనాడు ప్రారంభించారు. రూ.8,600 కోట్లతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ, రూ.1,011 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఐసీఎంఆర్-ఆర్ఎంఆర్‌సీ)కు చెందిన హై-టెక్ ల్యాబ్‌ను ప్రధాని  ప్రారంభించారు.


ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, గోరక్‌పూర్‌లో ఎరువుల ప్లాంట్, ఎయిమ్స్ ప్రారంభం కావడం ఎన్నో సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి రెట్టింపు వేగంతో దూసుకువెళ్తుందన్నారు. యూపీ అభివృద్ధిలో యోగి ఆదిత్యనాథ్ పాత్రను ప్రధాని మోదీ ప్రశంసిచారు. ఆరోగ్య సేవలనేవి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ఆ దిశంగా యోగి సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. గతంలో గోరఖ్‌పూర్‌లో మెదడువాపు పేషెంట్ల శాంపుల్స్ సైతం పుణెకు పంపాల్సి వచ్చేదని, ఫలితాలు వచ్చేసరికి ఆ పేషెంట్ చనిపోవడంతో, పక్షవాతం బారిన పడటమో జరిగేదని అన్నారు. ఈరోజు కరోనా వైరస్, మెదడువాపు, ఇతర వ్యాధుల పరీక్షలు గోరఖ్‌పూర్‌ని ప్రాంతీయ వైరల్ రీసెర్చ్ సెంటర్‌లోనే చేయించుకోవచ్చని చెప్పారు. 2014కు ముందు యూరియా కొరత అనేది పతాక శీర్షికల్లో కనిపించేదదని, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. యూరియా దుర్వినియోగం అరికట్టామని, కోట్లాది మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చామని చెప్పారు.


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించే ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజల ఆకాంక్ష దీనితో నెరవేరిందని, 1990లో మూతపడిన ఫ్యాక్టరీని 2014 వరకూ తిరిగి ప్రారంభించేందుకు ఎవరూ సాహసం చేయలేదని, బీజేపీకే అది చెల్లిందని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-07T20:01:47+05:30 IST