డబుల్‌ జాప్యం

ABN , First Publish Date - 2022-10-08T06:25:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా జిల్లాలో చేపడుతున్న పనులు నిలిచిపోయాయి. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

డబుల్‌ జాప్యం

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం

నిలిచిన ఇళ్ల నిర్మాణాలు

లబోదిబోమంటున్న జిల్లాలోని లబ్ధిదారులు

బిల్లుల కోసం తప్పని ఎదురు చూపులు

ఉన్న ఇళ్లను కూల్చి అవస్థలు పడుతున్న వైనం

రుద్రూరు, అక్టోబరు 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా జిల్లాలో చేపడుతున్న పనులు నిలిచిపోయాయి. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌  ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉన్న వారికి (ఇన్డివిజువల్‌)డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు కేటాయించింది. ఐదు విడతల్లో బిల్లులు మంజూరు చేస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఉన్న ఇంటిని కూల్చి గుడిసెలో ఉంటున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

రుద్రూరులో నిలిచిన నిర్మాణాలు..

రుద్రూరు మండలంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఏడాదిగా బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఉన్న ఇళ్లను కూల్చివేసి మరీ సొంత గూడు నిర్మాణానికి పూనుకున్న ప్రజల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. మండలంలోని లబ్ధిదారులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో బిల్లులు మంజూరు చేసే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటామని లబ్ధిదారులు ఆశా భావం వ్యక్తంచేస్తున్నారు. 

ఏడాదిగా ఎదురు చూపులు..

రుద్రూరు మండలంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు ఏడాది కాలంగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. రుద్రూరు గ్రామానికి 156, బొప్పాపూర్‌కు 30, రాయకూర్‌కు 30, అంబం(ఆర్‌)కు 30, చిక్కడ్‌పల్లికి 25, అక్బర్‌నగర్‌కు 44, రాణంపల్లికి 40, సిద్దాపూర్‌కు 20 చొప్పున ఇళ్లు మంజూరు కాగా ఇందులో బొప్పాపూర్‌, రాణంపల్లి గ్రామాల్లో మొదటి విడతలో కొన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు బిల్లులు వచ్చాయి. కానీ రెండో విడతలో మిగతా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఇళ్లను కూల్చివేసి కొత్తగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణాలు ప్రారంభించగా మధ్యలోనే  నిర్మాణాలు ఆపేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులకు ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేక అవస్థలు పడుతున్నారు. 

లబ్ధిదారులపై వడ్డీ భారం

ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేస్తుందన్న నమ్మకంతో కొందరు వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి మరీ నిర్మాణాలు చేపట్టారు. మరికొందరైతే నగలను విక్రయించి పనులను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు రాకపోవడంతో వడ్డీ భారం లబ్ధిదారులపై పడుతోంది. ఇంటి నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో పాటు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సకాలంలో బిల్లులు మంజూరు చేయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

రెండు రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం.. 

ఫ నాగేశ్వర్‌రావు, హౌసింగ్‌ ఏఈ  

మండలంలో రెండో విడతలో నిర్మిస్తున్న (ఇన్డివిజువల్‌) డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల బిల్లులు మరో రెండు రోజుల్లో వస్తాయి. ఇంటి నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Updated Date - 2022-10-08T06:25:26+05:30 IST