అసెంబ్లీలో డబుల్ సవాల్
ABN , First Publish Date - 2020-09-17T07:39:39+05:30 IST
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందికి ఇచ్చారు? నాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు? మళ్లీ ఎన్నికలు వస్తున్నందునే ఇళ్లను పంపిణీ చేస్తామని అంటున్నారు’’ అని భట్టి విమర్శించారు. ఇందుకు మంత్రి తలసాని స్పందించారు. రేపు తాను స్వయంగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనను తీసుకెళ్లి డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలను చూపిస్తానని చెప్పారు. దాంతో, లక్ష ఇళ్లను చూపిస్తానంటే రావడానికి తాను సిద్ధమేనని భట్టి జవాబిచ్చారు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు.