టైలు ధరించడం మానేయండి.. ప్రజలకు ప్రధాని సూచన

ABN , First Publish Date - 2022-07-31T05:14:38+05:30 IST

విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ప్రజలు టైలు కట్టుకోవడం మానేయాలని స్పెయిన్ ప్రధాని శుక్రవారం నాడు సూచించారు

టైలు ధరించడం మానేయండి.. ప్రజలకు ప్రధాని సూచన

ఎన్నారై డెస్క్: విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ప్రజలు టైలు కట్టుకోవడం మానేయాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంఛేజ్ శుక్రవారం నాడు సూచించారు. వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ..స్థానికులు అనేక మంది ప్రధాని సూచనను పాటించడం ప్రారంభించారు. ఓ మీడియాకు సమావేశానికి టై లేకుండానే హాజరైన ఆయన ఈ సూచన చేశారు. ‘‘నేను కూడా టై లేకుండానే వచ్చాను. మనందరం విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఇలా చేస్తే బాగుంటుంది. తోటి మంత్రులు ప్రభుత్వాధికారులకు కూడా ఇదే చెప్పాను’’ అని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. 


అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న స్పెయిన్ ప్రజలు గ్రీష్మ తాపాన్ని తట్టుకునేందుకు ఎయిర్ కండీషనర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో స్పెయిన్.. విద్యుత్ ఉత్పత్తి కోసం రష్యా ఇంధనంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇక వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల కాలంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవడం, చమురు సరఫరాపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న స్పెయిన్ తొలుత ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు నిర్ణయించింది. పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలకు భారంగా మారుతుండటంతో.. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త పొదుపు విధానాలను త్వరలో ప్రవేశపెడతానని ప్రధాని చెప్పారు. అయితే.. అవి ఏమిటనేది మాత్రం విపులీకరించలేదు. 

Updated Date - 2022-07-31T05:14:38+05:30 IST