24న నల్ల దుస్తులు ధరించొద్దు... ధరించినా పోలీసుల కంటపడవద్దు!

ABN , First Publish Date - 2020-02-16T14:11:20+05:30 IST

ఈనెల 24న నల్ల రంగు దుస్తులు ధరించి రోడ్లపై తిరిగేవారు చిక్కుల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోజు అమెరికా అధ్యక్షుడు ‘ఆగ్రా’ వస్తున్నారు.

24న నల్ల దుస్తులు ధరించొద్దు... ధరించినా పోలీసుల కంటపడవద్దు!

ఆగ్రా: ఈనెల 24న నల్ల రంగు దుస్తులు ధరించి రోడ్లపై తిరిగేవారు చిక్కుల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోజు అమెరికా అధ్యక్షుడు ‘ఆగ్రా’ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ నగరికి ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్నారు. ఆయన తాజ్‌మహల్ సందర్శించనున్న సందర్భంగా ఆగ్రాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఎవరైనా సరే నల్ల దుస్తులు ధరించి ఆగ్రా పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు. ఎందుకు ఇటువంటి దుస్తులు ధరించావని ప్రశ్నించి అడ్డుకునే అవకాశముంది. అలాగే ధర్నాలు, ఆందోళనలు చేస్తారేమోనని భావించి నల్ల దుస్తులు ధరించిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లే అవకాశముంది. పోలీసుల నుంచి ఇటువంటి ఆదేశాలు లేకపోయినప్పటికీ, ఆగ్రావాసులు గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి ఎప్పుడు వీవీఐపీలు వచ్చినా, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అణువణువునా తనిఖీలు నిర్వహిస్తుంటారు. అలాగే ఆగ్రాలో జరిగే ప్రధాని, సీఎం, బీజేపీ అధ్యక్షులు ర్యాలీలు, సభలు నిర్వహించినపుడు నల్ల దుస్తులు ధరించినవారిపై పోలీసులు దృష్టి సారిస్తుంటారు. ఇటువంటి వారిని సభలోనికి రాకుండా అడ్డుకుంటారు. కాగా ట్రంప్ రాక నేపధ్యంలో పోలీసులు 23వ తేదీ నుంచి ఆగ్రాలో బందోబస్తు నిర్వహించనున్నారు. 


Updated Date - 2020-02-16T14:11:20+05:30 IST