‘వృద్దులను చంపొద్దు’ అనే నినాదంతో.. ఇంగ్లాండ్‌లో..

ABN , First Publish Date - 2020-08-09T09:41:44+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారిలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

‘వృద్దులను చంపొద్దు’ అనే నినాదంతో.. ఇంగ్లాండ్‌లో..

ప్రెస్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారిలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే ఇమ్యూనిటీ ఉండటం వల్ల యువకులు త్వరగానే కరోనా నుంచి కోలుకుంటున్నారు. కానీ.. ఇదే సమయంలో యువకులు కరోనాను తమ ఇంట్లో ఉన్న వృద్దులకు అంటిస్తున్నారు. దీనివల్ల వయసు పైబడిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే జరుగుతోంది. ఆయా దేశాల్లోని నిపుణులు సైతం యువకులు ఫేస్‌మాస్క్ లేకుండా బయటకు రావొద్దంటూ హితబోధ చేస్తూనే ఉన్నారు. ఇక ఇంగ్లాండ్‌లోని ప్రెస్టన్ నగరానికి చెందిన ఆరోగ్యశాఖ అధికారులు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్దులను చంపొద్దు(డోన్ట్ కిల్ గ్రానీ) అనే నినాదంతో యువకులలో ఫేస్‌మాస్క్, భౌతికదూరంపై చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరం మొత్తం ఇదే నినాదంతో స్టిక్కర్లు అంటిస్తూ, ప్లకార్డులు పట్టుకుని తిరుగుతున్నారు. 45 లక్షల జనాభా కలిగి ఉన్న ప్రెస్టన్ నగరంలో యువకులు నైట్‌క్లబ్‌లకు ఫేస్‌మాస్క్ ధరించకుండానే వెళ్లిపోతున్నారు. పైగా భౌతికదూరం కూడా పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీంతో వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు ఈ విధంగా కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ విధంగా అయినా యువకుల్లో మార్పు వస్తుందేమోనని అధికారులు ఆశ పడుతున్నారు. 

Updated Date - 2020-08-09T09:41:44+05:30 IST