ఐపీలఓల్లో... తొందరొద్దు...

ABN , First Publish Date - 2021-12-05T23:14:20+05:30 IST

స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకుని పెట్టుబడులు పెడితే... మంచి ఆదాయమే వస్తుంది. గుడ్డిగా అడుగులు వస్తే మాత్రమే... మాయాజాలంలో ఇరుక్కున్నట్లే.

ఐపీలఓల్లో... తొందరొద్దు...

హైదరాబాద్ :  స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకుని పెట్టుబడులు పెడితే... మంచి ఆదాయమే వస్తుంది. గుడ్డిగా అడుగులు వస్తే మాత్రమే... మాయాజాలంలో ఇరుక్కున్నట్లే. అంటే... మార్కెట్‌లోకి వెళ్ళేముందే... సొంతంగా పరిశోధన చేయాలి. ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాతే ట్రేడింగ్ చేయడం బెటర్ అని నిపణులు చెబుతున్నారు. అంతేతప్ప... ర్యాలీ చూసి కానీ, గాలివాటంగా కానీ వెళితే... ఉన్న డబ్బు గాలికొదిలేసినట్లే. ప్రత్యేకించి... ప్రచారం చూసి తప్పటడుగులు వేయవద్దన్నది అనుభవజ్ఞుల సూచన. ఇక... ఇదంతా ఎందుకంటే... ఈ కథనం చదవండి... 


స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం ఐపీఓ బూమ్ నడుస్తోన్న విషఫయం తెలిసిందే. స్టాక్ మార్కెట్ ర్యాలీ చేస్తోంది కాబట్టి... కంపెనీలు కూడా ఇదే తగిన సమయంగా భావించి ఐపీఓలతో వస్తున్నాయి. ఇందులో సమర్ధత కలిగిన కంపెనీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా...  పనితీరు బాగాలేకపోయినా సొమ్ము చేసుకోవడానికి వస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి...  కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన బడా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు లాభాలు జేబులో వేసుకోవడానికి ఐపీఓ ద్వారా వచ్చి వాటాలను విక్రయిస్తున్నాయి. ఎక్కు భాగం ఇలా వచ్చిన కంపెనీలే ఉంటాయి. ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగముండదు. ఎందుకంటే... సేకరించిన మొత్తంలో ఎక్కువ భాగం డబ్బు... వారి జేబుల్లోకే వెళుతూంటుంది. అంతేతప్ప... విస్తరణకు మూలధనాన్ని పెద్దగా వినియోగించరు. నిరుడు...  అంటే 2020 లో కేవలం 16 కంపెనీలు రూ. 26 వేల కోట్లు నిధులు సమీకరిస్తే.. ఈ ఏడాది(2021 లో)  ఇప్పటివరకు 54 కంపెనీల రూ. లక్ష కోట్లకు పైగా సేకరించడం గమనార్హం. వీటిలో లాభాలు జేబులో వేసుకున్న కంపెనీలెన్ని ? విస్తరణకు నిధులు సమకూర్చుకున్న కంపెనీలెన్ని? ఈ వివరాలను  తెలుసుకుంటే వీటిలో మాయాజాలం అర్ధమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.  


పేటీఎం, స్టార్ అనుభవాలు..

కొత్తగా మార్కెట్‌లోకి రావాలనుకుంటున్నవారు ఇటీవలి ఐపీఓల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే... వీరిలో చాలా మంది... కంపెనీపై అవగాహన కంటే కూడా ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారని ఓ పర్వేలో వెల్లడైంది. అలా నష్టపోయినవారిలో... పేటీఎం బ్యాచ్ కూడా ఉంది.పేటీఎం ఐపీఓపై భారీగా ప్రచారం జరిగింది. అంతేకాదు... విపరీతమైన వాల్యుయేషన్‌ను కూడా చూపించారు. నష్టాల్లో ఉన్న కంపెనీ అయినప్పటికీ... లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నట్లు చూపించారన్న విమర్శలు తారస్థాయిలోనే ఉన్నాయి.


ఇక... అంతకుముందు జోమాటో ఆకట్టుకోవడంతో యూనికార్న్ కూడా భారీగా లాభాలనిస్తుందని ప్రచారం జరిగింది. మరోవైపు సోషల్ మీడియా కూడా కోడై కూసింది. బ్రోకరేజి సంస్థలు, నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా, సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువగా చొచ్చుకుపోయింది. చివరకు లిస్టింగ్ రోజు మాత్రం షేరు 40 శాతం మేర పడిపోయి తీవ్ర నష్టాల పాలైన విషయం తెలిసిందే. ఇక... జొమాటో లిస్టింగ్ లాభాలు తీసుకున్నవాళ్లు కూడా భారీగా పెట్టారు. కానీ నష్టాల పాలయ్యారు.


ఇప్పుడు స్టార్‌హెల్త్ కూడా పలు అనుమాలకు తావిస్తున్నట్లుగా వినవస్తోంది. కేవలం రాకేష్ ఝన్‌ఝన్‌వాలాకు ఇందులో 17శాతం వరకూ వాటా ఉంది. ఆయన మంచి ఇన్వెస్టరే అయినప్పటికీ... ఆయనకు వాటా ఉందని ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తుండడం గమనార్హం. ఎట్టకేలకు...  పేటీఎమ్ ప్రభావంతో స్టార్ కు ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం... 79 శాతం మాత్రమే సబ్ స్క్రిప్షన్ రావడం గమనార్హం. కాగా... మార్కెట్ క్యాప్ మాత్రం  అధికంగానే ఉంది. అయితే... ఇందులో ఇన్వెస్టర్ల వాటాలు అధికంగా విక్రయిస్తుండడం విశేషం. 

 

ధరఖాస్తు చేసేముందు...

కంపెనీ ప్రొఫైల్ చూడాలి. లాభనష్టాలు అంచనా వేయాలి. దీంతో పాటు భవిష్యత్తు మార్కెట్... కంపెనీ టార్గెట్ చేసిన మార్కెట్ కీలకం. ఇదిలా ఉంటే... బ్యూటీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నందున... నైకా కంపెనీ ఖచ్చితంగా లాభపడుతుందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మార్కెట్ వస్తోన్న నేపధ్యంలో... షేర్లూ లాభపడ్డాయి. అలాగే ఫార్మా, డిఫెన్స్ సెక్టార్లలో కూడా భవిషఫ్యత్తు ఉంటుందని చెబుతున్నారు. అంతేతప్ప... పోటీ ఎక్కువ ఉన్న కంపెనీల్లో హై వాల్యుయేషన్ వద్ద వస్తే ఐపీఓకు ధరఖాస్తు చేయడం వృధా అన్న అభిప్రాయాలున్నాయి. కంపెనీ ఐపీఓకు వస్తుంటే... అప్పులు తీర్చడానికి వస్తోందా ? విస్తరణకు వస్తోందా ? లేక అందులో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటాలను అమ్ముకుంటున్నారా ? తదితర అంశాలు కీలకం. ప్రచారం కాదు... నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా అవసరం.


మొత్తంమీద కొత్తగా కోట్లమంది యువ ఇన్వెస్టర్లు వస్తోన్న విషయం తెలిసిందే. కొత్తతరం కంపెనీలు మార్కెట్‌లోకి రావడం కూడా మంచిదే కానీ, అందులో ఏది మంచిది ? ఏది కాదు ? అన్న విషయాలను తెలుసుకోవాలి. అయితే... ఇందుకుగాను సోషల్ మీడియాపైనే ఆధారపడవద్దని చెబుతున్నారు. ఇటీవల మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా నిపుణులు కూడా కంపెనీలతో టై అప్ అయి, సోషల్ మీడియాలో అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారని వినవస్తోంది. అలాకాకుండా నేరుగా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 

Updated Date - 2021-12-05T23:14:20+05:30 IST