పింఛను అందక..
ABN , First Publish Date - 2022-07-03T05:08:57+05:30 IST
సంకిలి పంచాయతీలో పింఛనుకు నోచుకోక 96 మంది నిరాశ చెందుతున్నారు. సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పంచాయతీలో వివిధ రకాల పింఛన్లన్నీ కలిపి 748 ఉండగా వీరందరికీ నెలకు రూ.18.26లక్షలు అవసరం.
సంకిలిలో 96 మంది ఎదురుచూపులు
రేగిడి, జూలై 2: సంకిలి పంచాయతీలో పింఛనుకు నోచుకోక 96 మంది నిరాశ చెందుతున్నారు. సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పంచాయతీలో వివిధ రకాల పింఛన్లన్నీ కలిపి 748 ఉండగా వీరందరికీ నెలకు రూ.18.26లక్షలు అవసరం. ఈ గ్రామ బ్యాంక్ అకౌంట్కు ఈ నెల పింఛన్ల కోసం ఇప్పటివరకు రూ.15.1లక్షలు మాత్రమే జమైంది. దీంతో రెండురోజుల్లో 652మందికే పింఛన్లు పంపిణీ చేశారు. మిగితావారు సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మరోరోజు వీరు నిరీక్షించక తప్పదు. రేగిడి మండలంలోని 25 సచివాలయాల పరిధిలో 10592 పింఛన్దారులు ఉన్నారు. వారందరికీ పంపిణీ కోసం రూ.2.69 కోట్లు అవసరం. రూ.2.59 కోట్లు జమకాగా ఇంకా రూ. 4.13లక్షలు రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పింఛను నిలిచిపోయిన వారిలో సంకిలి పంచాయతీలో ఎక్కువ మంది ఉన్నారు. దీనిపై ఎంపీడీవో రఘనాథ్ ఆచారిని వివరణ కోరగా నగదు కొరత వాస్తవమేనని, ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాకు జమైన మొత్తాన్ని పంపిణీ చేశామన్నారు. సంకిలికి ఇంకా నగదు జమకావాల్సి ఉందని వెల్లడించారు.