మహమ్మారికి మొహమాటం నాస్తి

ABN , First Publish Date - 2021-04-17T06:13:53+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ మతపరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించవద్దని, పాల్గొనవద్దని, తీర్థయాత్రలు చేయవద్దని చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొహమాటం....

మహమ్మారికి మొహమాటం నాస్తి

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ మతపరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించవద్దని, పాల్గొనవద్దని, తీర్థయాత్రలు చేయవద్దని చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొహమాటం. ఎవరికి ఏం చెప్పినా ‘మాకు మాత్రమేనా నిబంధనలు’ అంటారనే సందేహంతో అన్ని మతాలను గౌరవిస్తాయి.‍ మీటింగులు గట్రా ఇప్పుడొద్దని నాయకులకు, కార్యకర్తలకు చెప్పడానికి రాజకీయ పార్టీలకు మొహమాటం. వాళ్లెక్కడ హర్టయి అలుగుతారోనని, ఈలోగా ప్రతిపక్షం ఎక్కడ ముందుకు దూసుకుపోతోందనని వాటికి భయం. బజారులో, రోడ్డు మీదా మాస్కు పెట్టుకోకపోతే కొరడా ఝళిపిస్తాం అని ప్రజలను హెచ్చరించడానికి అధికారులకు మొహమాటం. మీ జులుంకి మేమే దొరికామా, ‘పెద్దోళ్ళు’ కనబడటం లేదా? అని సామాన్యులెక్కడ చిర్రుబుర్రులాడుతారోననే సందిగ్ధం. పక్కనున్నవారు రోడ్డు మీద తుపుక్కున ఉమ్మినా, మాస్కు లేకుండా తిరిగినా, అదేమిటని ప్రశ్నిస్తే వారేమనుకుంటారోనని మనకి మొహమాటం.


ఏ మొహమాటం లేనిది కరోనా వైరస్‌కే. ‘ఎవరైతే నాకేంటి? అవకాశమిస్తే అందరి మీదా స్వారీ చేసేస్తాన’ని ఒళ్లు గుద్ది మరీ చెప్పేస్తోంది. ఒక్క రోజులోనే దేశంలో నమోదైన కేసులు 2 లక్షలు దాటాయి. అయినా మార్కెట్లు, మేళాలు, ర్యాలీలు ఏవీ ఆగడం లేదు. వ్యక్తిగత స్థాయిలో నిబంధనలు పెట్టి, సామూహిక స్థాయిలో నీళ్లు నములుతున్నాం. మరి కరోనా మహమ్మారికి అడ్డేమిటి? ఒకరి నుంచి కనీసం ఏభై మందికి ఇట్టే వ్యాప్తిచెందగల వైరస్ పట్ల ఒకరు ఉదాసీనత చూపినా ఏభై మంది ప్రమాదంలో పడినట్టే. కరోనాపై పోరు అంటే అం దరూ చేయాల్సిన యుద్ధం. దానికెలాంటి మినహాయింపు లేదు. ఆ బాధ్యత అందరిపై ఉంది.


– డి.వి.జి.శంకర రావు

Updated Date - 2021-04-17T06:13:53+05:30 IST