దాతలూ.. నా కుమార్తెను బతికించండి!
ABN , First Publish Date - 2022-03-10T07:52:37+05:30 IST
చదువులో మెరుగు.. ఆటపాటల్లో చురుకు.. నిన్నమొన్నటి వరకు భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో బడికెళుతున్న ఆ బాలికకు.
- బోన్ కేన్సర్తో బాధపడుతున్న బాలిక.. ఆపరేషన్కు 6 లక్షలు
- ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్న నిరుపేద తండ్రి
హైదరాబాద్ సిటీ, మార్చి9 (ఆంధ్రజ్యోతి): చదువులో మెరుగు.. ఆటపాటల్లో చురుకు.. నిన్నమొన్నటి వరకు భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో బడికెళుతున్న ఆ బాలికకు.. ఊహించని కష్టం వచ్చిపడింది. భుజం నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు.. బోన్ కేన్సర్ అని తేలింది. అంతే.. ఆ నిరుపేద తండ్రి నెత్తిన పిడుగు పడ్డట్లయింది. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో.. తన కుమార్తెను కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నాడు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన బి.రాజనర్సింహ.. దినసరి కూలీ. ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారుల్లో ఒకరు ఐటీఐ, మరొకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. కు మార్తె గాయత్రి (14) తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఆమెకు కొంత కాలంగా భుజం నొప్పి వస్తుండడంతో.. తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు బోన్ కేన్సర్ అని తేల్చారు. దీంతో.. హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో చే ర్పించి.. ఆరోగ్యశ్రీ కింద రెండు నెలలుగా చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఈ నెల 22న శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అందుకుగాను రూ.6 లక్షలు ఖర్చవుతుందని, సిద్ధం చేసుకోవాలని వైద్యులు సూచించారు. రోజుకూలీ చేసుకుని బతికే తాను.. అంత భరించలేనని, దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని రాజనర్సింహ వేడుకుంటున్నాడు. సహాయం చే యదలుచుకున్న వారు 7036475197 ఫోన్ నెంబర్కు జీపే, ఫోన్పే ద్వారా పంపించాలని కోరుతున్నారు.