కుటీర నిర్మాణ పథకానికి రూ.15 లక్షలు విరాళం
ABN , First Publish Date - 2022-05-20T07:15:19+05:30 IST
శ్రీశైల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కుటీర నిర్మాణ పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశ సదనంలోని ఒక గది నిర్మాణానికి గుంటూరుకు చెందిన బొమ్మిడాల నారాయణమూర్తి అనే భక్తుడు భార్య బొమ్మిడాల వెంకట రత్నమ్మ జ్ఞాపకార్థం రూ.15 లక్షల విరాళాన్ని అందజేశారు.
శ్రీశైలం, మే 19: శ్రీశైల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కుటీర నిర్మాణ పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశ సదనంలోని ఒక గది నిర్మాణానికి గుంటూరుకు చెందిన బొమ్మిడాల నారాయణమూర్తి అనే భక్తుడు భార్య బొమ్మిడాల వెంకట రత్నమ్మ జ్ఞాపకార్థం రూ.15 లక్షల విరాళాన్ని అందజేశారు. దాత మనవడు పెండంటి రఘునాథ్ విరాళ డిమాండ్ డ్రాఫ్ట్ను ధర్మకర్తమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్నకు అందజేశారు.
నిత్యాన్నదాన పథకానికి..
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గురువారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన సుర్వి సతీష్ కుమార్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు సాయికుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదానం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు.
ఆలయాలకు విరాళం
బనగానపల్లె, మే 19: మండలంలోని నందవరం చౌడేశ్వరీదేవి మాత ఆలయ అభివృద్ధికి నంద్యాల మండలం మూలసాగరం గ్రామానికి చెందిన మేడం చౌరెడ్డి, తులశమ్మ రూ.లక్ష విరాళాన్ని గురువారం అందించారు. ఈవో రామానుజన్, ఆలయ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డికి నగదు అందించారు.
పాణ్యం: మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రహారీ నిర్మాణానికి భక్తులు రూ.2 లక్షలు విరాళం అందజేశారు. గురువారం కర్నూలుకు చెందిన పడకండ్ల చెన్నయ్య జ్ఞాపకార్థం ఆయన భార్య లక్ష్మమ్మ, కుమారులు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, రూ.2లక్షలు విరాళాన్ని ఆలయ ఈఓ రామకృష్ణకు అందజేశారు.