దానం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు!
ABN , First Publish Date - 2021-04-13T05:23:18+05:30 IST
భూదానం కింద 1985లో ప్రభుత్వం తమ కుటుంబాలకు ఇచ్చిన 19ఎకరాల 26గుంటలని కబ్జా చేసి సోమశిల హిల్స్ పేరుతో రియల్ ఎస్టేట్ చేశారని కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని వరిదెల శివారు రైతులు గోవుల వెంకటస్వామి, చుక్కా కృష్ణయ్యగౌడ్, మర్ల వెంకటేశ్వర్లు, మర్ల ఖాదర్లు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి విభాగంలో ఫిర్యాదు చేశారు.
- మా భూమిని మాకు ఇప్పించండి
- కలెక్టరేట్ ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు
నాగర్కర్నూల్ కలెక్టరేట్, ఏప్రిల్ 12: భూదానం కింద 1985లో ప్రభుత్వం తమ కుటుంబాలకు ఇచ్చిన 19ఎకరాల 26గుంటలని కబ్జా చేసి సోమశిల హిల్స్ పేరుతో రియల్ ఎస్టేట్ చేశారని కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని వరిదెల శివారు రైతులు గోవుల వెంకటస్వామి, చుక్కా కృష్ణయ్యగౌడ్, మర్ల వెంకటేశ్వర్లు, మర్ల ఖాదర్లు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి విభాగంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నలుగురు రైతుల తండ్రులకు వరిదెల శివారులోని సర్వే నెంబరు 113లో 10ఎకరాలు, అలాగే 112 సర్వే నెంబరులో 9ఎరకాల 26గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం భూదాన్ బోర్డు ద్వారా పట్టా ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమిని గ్రామానికి చెందిన దేవమ్మ, నాగరాజు, శ్రీనివాసులు, పుల్లారెడ్డి, విజయమోహన్ తప్పుడు ఆర్వోఆర్, పహాని సృష్టించి కబ్జా చేసి రియల్ వ్యాపారులకు అమ్ముకున్నారని ఫిర్యాదులో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి భూదానం భూమిపై విచారణ జరిపించి చట్ట పరంగా తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.