ట్రంప్‌ ప్రభుత్వానికి షాక్.. హెచ్1బీ వీసా ఆశావాహులకు భారీ ఊరట!

ABN , First Publish Date - 2020-12-02T20:52:32+05:30 IST

హెచ్1బీ వీసా ఆశావాహులకు భారీ ఊరట లభించింది. ట్రంప్ సర్కార్‌కు ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది. హెచ్1బీ వీసా జారీపై ట్రంప్ ప్రభుత్వం అక్టోబర్‌లో విధించిన ఆంక్షలను యూఎస్ ఫెడరల్ కోర్టు కొట్టేసింది

ట్రంప్‌ ప్రభుత్వానికి షాక్.. హెచ్1బీ వీసా ఆశావాహులకు భారీ ఊరట!

వాషింగ్టన్: హెచ్1బీ వీసా ఆశావాహులకు భారీ ఊరట లభించింది. ట్రంప్ సర్కార్‌కు ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది. హెచ్1బీ వీసా జారీపై ట్రంప్ ప్రభుత్వం అక్టోబర్‌లో విధించిన ఆంక్షలను యూఎస్ ఫెడరల్ కోర్టు కొట్టేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లను తనవైపు తిప్పుకోవడంపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రరాజ్యంలోకి విదేశీ నిపుణులు అడుగుపెట్టడానికి వీలు లేకుండా హెచ్1బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు నిషేధించారు. అంతేకాకుండా అమెరికన్లు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో స్థానికులతో సమానంగా విదేశీ నిపుణులకు సంస్థలు వేతనాలు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ నిబంధన అమెరికాలోని సంస్థలకు ముఖ్యంగా ఐటీ సంస్థలకు ఇబ్బందిగా మారింది. దీంతో ట్రంప్ విధించిన ఆంక్షలపై కోర్టును ఆశ్రయించాయి.


ఈ క్రమంలో కేసును విచారించిన కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానం ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను కొట్టేసింది. ఈ సందర్భంగా ఫెడరల్ కోర్టు జడ్జి జెఫ్రీ వైట్ మాట్లాడుతూ.. హెచ్1బీ వీసాల జారీపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధించడం ద్వారా దరఖాస్తుల సంఖ్య మూడో వంతుకు పడిపోతుందనే వాదనను ట్రంప్ ప్రభుత్వం నిరూపించుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలోపడేందుకు ఇప్పుడు విదేశీ నిపుణుల అవసరం అమెరికాకు గతంలో కంటే ఎక్కువగా ఉందని పలు సంస్థలు అభిప్రాపడ్డాయి. కాగా.. అమెరికా ప్రభుత్వం ఏటా 85వేల హెచ్1బీలను జారీ చేస్తుంది. ఈ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో చైనా, భారత పౌరులే ముందువరుసలో ఉంటారు. ఈ క్రమంలో హెచ్1బీ వీసా ఆశావాహులకు కోర్టు తీర్పు ద్వారా భారీ ఊరట లభించింది. 

Updated Date - 2020-12-02T20:52:32+05:30 IST