ట్విటర్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-26T17:40:22+05:30 IST

సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ చాలా బోరింగ్‌గా తయారైందని

ట్విటర్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

శాన్‌ఫ్రాన్సిస్కో : సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ చాలా బోరింగ్‌గా తయారైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వేదికను టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వశం చేసుకున్నప్పటికీ, తాను మళ్ళీ ఆ వేదికపైకి రాబోనని చెప్పారు. తాను కేవలం తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’ను మాత్రమే ఉపయోగిస్తానని తెలిపారు. 


అమెరికన్ మీడియా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, తాను ట్విటర్‌ను మళ్ళీ ఉపయోగించబోనని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాను ట్రూత్ సోషల్‌లోనే తన అభిప్రాయాలను పంచుకుంటానని తెలిపారు. ఎలన్ మస్క్ మంచి వ్యక్తి అని, ఆయన ట్విటర్‌కు మెరుగులు దిద్దుతారని ఆశిస్తున్నానని చెప్పారు. తాను మాత్రం ట్రూత్‌లోనే కొనసాగుతానని తెలిపారు. వచ్చే వారం నుంచి తాను ట్రూతింగ్ చేయడం మొదలుపెడతానని చెప్పారు. ట్విటర్ చాలా బోరింగ్‌గా మారిపోయిందన్నారు. చాలా మంచి గళాలను ట్విటర్‌ వదులుకుందన్నారు. ముఖ్యంగా కన్జర్వేటివ్ వాయిసెస్‌ను కోల్పోయిందన్నారు. TRUTH తన గళానికి, తన మద్దతుదారుల గళాలకు వేదిక అని చెప్పారు. TRUTH వేదికపైకి అందరూ రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. కన్జర్వేటివ్స్, లిబరల్స్, ఎవరైనా రావచ్చునని చెప్పారు. 


ట్విటర్ ప్రైవేట్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేయడానికి బిడ్‌ను ఎలన్ మస్క్ గెలుచుకున్నట్లు ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2021 జనవరి 6న అమెరికా కేపిటల్ హిల్‌పై దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌ను ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌ల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 




Updated Date - 2022-04-26T17:40:22+05:30 IST