‘గాంధీ’లో డ్యూటీ చేస్తే... ఇంటికి రావద్దు..!
ABN , First Publish Date - 2020-03-30T09:48:45+05:30 IST
‘‘అత్యవసర సేవల్లో భాగంగా గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నాకు కాలనీవాసుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి.
జవహర్నగర్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ‘‘అత్యవసర సేవల్లో భాగంగా గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నాకు కాలనీవాసుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అంటూ 4వ తరగతి ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం... గాంధీ ఆస్పత్రిలో 4వ తరగతి ఉద్యోగినిగా పనిచేస్తున్న దుప్పటి విజయ కుటుంబ సభ్యులతో కలిసి కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్నగర్ కాలనీలో నివాసం ఉంటోంది.
రోజూ మాదిరిగానే ఆస్పత్రిలో విధులు ముగించుకుని శనివారం ఇంటికి చేరుకుంది. అదే కాలనీలో నివాసం ఉంటున్న పలువురు ఆమె ఇంటికి వచ్చి గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తే అక్కడి నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉందని, అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, లేకుంటే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. మాట వినకపోతే బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామని బస్తీవాసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని టీజేఎస్ నాయకురాలు గీతాంజలికి వివరించడంతో ఆమె సహాయంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.