కరోనాతో యుద్ధం చేస్తున్నా

ABN , First Publish Date - 2020-08-11T11:13:25+05:30 IST

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, తన కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడ్డారని దీంతో ఇంటా బయట కరోనాతో

కరోనాతో యుద్ధం చేస్తున్నా

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోండి

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి


ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 10: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, తన కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడ్డారని దీంతో ఇంటా బయట కరోనాతో యుద్ధం చేస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రికి వచ్చి స్వాబ్‌ శాంపిల్స్‌ ఇచ్చారు. ఈసీజీ, బీపీ తదితర ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రిలో కరోనా పరీక్షల గురించి, కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యం గురించి ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌నాఽధ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన వ్యక్తిగత సహాయకునికి, డ్రైవర్‌, కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, అందరూ తగిన చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారన్నారు.


తన సతీమణి రమాదేవికి కూడా కరోనా వచ్చిందన్నారు. దీంతో తనకు కరోనా లక్షణాలు లేకపోయినా మూడు రోజులుగా వైద్యుల సూచనల మేరకు మందులు వాడటమే కాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. ఆరు నెలలుగా ప్రజలు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వారిలో అవగాహన కల్గిస్తూ, కరోనాతో యుద్ధం చేస్తున్నానన్నారు. కరోనా వచ్చిందని ప్రజలు భయపడవద్దని, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు.

Updated Date - 2020-08-11T11:13:25+05:30 IST