ఓటరు కార్డులో కుక్క ఫొటోనా?
ABN , First Publish Date - 2020-02-20T10:10:42+05:30 IST
కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు ముద్రించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అసలు ఓటర్ల జాబితాలోకి కుక్క ఫొటో ఎలా వచ్చింది? కనీసం పరిశీలించకుండానే ఓటరు కార్డు...
- ఒకే వ్యక్తికి 12 ఓట్లా?.. హైకోర్టు ఆగ్రహం
- వివరణకు ఆదేశం.. విచారణ నేటికి వాయిదా
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు ముద్రించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అసలు ఓటర్ల జాబితాలోకి కుక్క ఫొటో ఎలా వచ్చింది? కనీసం పరిశీలించకుండానే ఓటరు కార్డు ముద్రించేస్తారా? ఇదేం పని తీరు? ఇందుకు బాధ్యులెవరు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే, ఒకే వ్యక్తికి 12 ఓట్లు కట్టబెడుతూ గుర్తింపుకార్డులు ఇవ్వడం పట్లా విస్మయం వ్యక్తం చేసింది. ఒకే వ్యక్తికి వేర్వేరు ఇంటి నంబర్లతో ఎలా గుర్తింపు కార్డు ఇచ్చారని నిలదీసింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది.
ఎలాంటి సవరణలు చేపట్టకుండా, ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే తుది జాబితాను సిద్ధం చేస్తున్నారని ఏలూరుకు చెందిన ఎస్వీ చిరంజీవి, ఎం.రాము, వి.శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ముందు విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జాబితాలో జరిగిన పొరపాట్లను సవరిస్తున్నామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పూర్తి వివరాలందించేందుకు గడువు కావాలని అభ్యర్థించారు. న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.