రాహుల్ గాంధీకి అది అర్థమవుతుందా? : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-08-25T23:35:18+05:30 IST

మానెటైజేషన్ అంటే ఏమిటో కాంగ్రెస్ నేత రాహుల్

రాహుల్ గాంధీకి అది అర్థమవుతుందా? : నిర్మల సీతారామన్

ముంబై : మానెటైజేషన్ అంటే ఏమిటో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలుసా? అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రశ్నించారు. సోమవారం ఆమె ప్రకటించిన నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌పై రాహుల్ విమర్శలకు ఆమె బుధవారం ఘాటుగా స్పందించారు. దేశంలోని వనరులను అమ్మేసి, ముడుపులు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. 


‘‘మానెటైజేషన్ అంటే ఏమిటో రాహుల్ గాంధీకి అర్థమవుతుందా? దేశంలోని వనరులను అమ్మేసి, ముడుపులు పుచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీయే’’ అని నిర్మల సీతారామన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 2008లో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మానెటైజ్ చేసి రూ.8,000 కోట్లు సేకరించిందన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన చేసినది యూపీయే ప్రభుత్వమేనని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌ సమయంలో జరిగిన అవినీతిని ప్రస్తావించారు. 


మానెటైజేషన్ అంటే ఆస్తులను అమ్మడం కాదని పునరుద్ఘాటించారు. ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారన్నారు. ఇవి పూర్తయిన బ్రౌన్‌ఫీల్డ్ అసెట్స్ అని, అయితే వీటి వినియోగం తక్కువగా ఉందని అన్నారు. వీటిని పరిపూర్ణంగా వినియోగంలోకి తేవడం కోసం మానెటైజేషన్ ప్రక్రియను అనుసరిస్తున్నామన్నారు. 


నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు, మరికొన్ని సంస్థల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ స్పందిస్తూ, 70 ఏళ్లుగా ప్రజా ధనంతో నిర్మించిన కిరీటంలోని రత్న, మణి, మాణిక్యాలను అమ్మేసి, తన మిత్రులైన పారిశ్రామికవేత్తలకు ఇచ్చుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సహాయపడే పథకం ఇది అని ఆరోపించారు. 


టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతూ, నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌ పథకం మునుపెన్నడూ లేనటువంటి ప్రజా వ్యతిరేక పథకమని ఆరోపించారు. దీని గురించి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పలేదని, ఆ పార్టీ మేనిఫెస్టోలో దీని ప్రస్తావన లేదని అన్నారు. 


ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వోద్యోగాలను తగ్గించే ప్రణాళికగా నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌ను అభివర్ణించారు. ఇది ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. 



Updated Date - 2021-08-25T23:35:18+05:30 IST