కొవిడ్పై పోరులో వైద్యుల సేవలు మరువలేం: తమిళిసై
ABN , First Publish Date - 2021-12-18T02:24:21+05:30 IST
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు అందించిన సేవలు ఎంతో గొప్పవని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు.
విశాఖపట్నం: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు అందించిన సేవలు ఎంతో గొప్పవని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. తమిళి సై ఉదయం ఆంధ్ర మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి సవాల్ విసిరిన కొవిడ్ మహమ్మారిపై పోరులో వైద్యుల పాత్రను మరువలేమన్నారు. కోట్లాది మంది ప్రాణాలను నిలిపారని కొనియాడారు. ఒక వైద్యురాలిగా కొంతమందికి మాత్రమే సేవ చేసేందుకు అవకాశముంటుందని, అదే రాజకీయాల్లో వుంటే ఎక్కువ మందికి సేవ చేసేందుకు అవకాశముంటుందనే తాను అటువైపు వెళ్లినట్టు ఆమె వెల్లడించారు. వైద్య వృత్తి గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్క వైద్యుడు కృషిచేయాలని తమిళి సై సూచించారు.