స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రమేష్ బాబు తాజా వ్యాఖ్యలివీ..
ABN , First Publish Date - 2020-08-15T03:32:48+05:30 IST
విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.
విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయడంతో పాటు.. కొంత మందికి నోటీసులిచ్చి విచారణ కూడా చేశారు. మరోవైపు జాయింట్ కలెక్టర్తో కూడిన కమిటీ సైతం ఇవాళ ప్రాథమిక నివేదికను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్కు అందజేసింది. ఆ నివేదికను నిశితంగా పరిశీలించిన కలెక్టర్.. రమేష్ ఆసుపత్రికి కోవిడ్ ట్రీట్మెంట్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ జరిగిన మొత్తం విషయాలపై, ప్రజాప్రతినిధుల ప్రెస్మీట్లపై డాక్టర్ రమేష్ బాబు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావనకు తెచ్చారు.
కులాన్ని అంటగట్టడం సరికాదు..
‘వైద్య చికిత్సలో కులం, మతం లాంటివి చూడము. కొందరు ప్రజాప్రతినిధులు రమేష్ చౌదరి అని మీడియాలో మాట్లాడుతున్నారు. వైద్యం అనేది కులాన్ని అడ్డంపెట్టుకొని పదవులు, వ్యాపారాభివృద్ది చేయడం కాదు. కళకి, వైద్యానికి కులాన్ని అంటగట్టడం సరికాదు. రిసెప్షన్, కంప్యూటర్ రూమ్లో షార్ట్ సర్య్కూట్తో మంటలు చెలరేగాయని సమాచారం ఉంది. కలెక్టర్ అనుమతితో స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశాం. కలెక్టర్ కొందరు ఉన్నతాధికారులను చికిత్స కోసం రిఫర్ చేశారు. హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్ మెంట్ నిర్వహణ బాధ్యత హోటల్దే. పేషెంట్ మెడికల్ సర్వీసెస్ రమేష్ హాస్పిటల్ బాధ్యత. హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించి నైట్ డ్యూటీలో ఉన్నవారిని అరెస్ట్ చేయకుండా ఆస్పత్రి సిబ్బందిని అవసరమైనప్పుడు విచారణకు పిలవకుండా ఎందుకు రిమాండ్కు పంపారు’ అని రమేష్ బాబు ప్రశ్నించారు.
న్యాయవిచారణకు సిద్ధం..
‘ప్రమాదం రోజు కలెక్టరేట్లో విచారణకు హాజరయ్యాను. ఆ తర్వాత డాక్టర్ రాజగోపాల్, సుదర్శన్ను నిర్భందించారని తెలిసింది. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని లీగల్ అడ్వైజర్స్ చెప్పారు. అధికారులు విచారణకు పిలిచే వరకు వేచి ఉండాలని సూచించారు. నిష్పక్షపాతంగా న్యాయవిచారణకు సిద్ధం. బిల్లింగ్ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాం’ అని రమేష్ చెప్పుకొచ్చారు. కాగా.. ఇవాళ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను సుమారు 7గంటల పాటు పోలీసులు విచారించిన విషయం విదితమే.