ప్రధాని కార్యాలయం పేరుతో ఈమెయిల్స్... ఎవరా అని పోలీసులు ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2020-11-28T03:47:09+05:30 IST

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారుల పేరుతో ఈమెయిల్ ఐడీలు సృష్టించి ప్రభుత్వ...

ప్రధాని కార్యాలయం పేరుతో ఈమెయిల్స్... ఎవరా అని పోలీసులు ఆరా తీస్తే..!

అహ్మదాబాద్: ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారుల పేరుతో ఈమెయిల్ ఐడీలు సృష్టించి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్న ఓ వైద్యుడిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అతడు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని గుజరాత్‌లోని అమ్రేలికి చెందిన డాక్టర్ విజయ్ పారిఖ్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే... ఇటీవల పీఎంవో అధికారులమంటూ కొందరు ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులకు ఈమెయిల్స్ వచ్చాయి. అహ్మదాబాద్‌లోని పరిమళ్ గార్డెన్ ప్రాంతంలో నిషిత్ షా అనే వ్యక్తి వద్ద పారిఖ్ రెండు ఆఫీసులు కొనుగోలు చేశారనీ... అయితే షా వాటిని అప్పగించకుండా పారిఖ్‌ను మోసం చేశాడని సదరు మెయిళ్లలో పేర్కొన్నారు. ఈ పరిణామాలను ప్రధాని కార్యాలయం ‘‘నిత్యం పర్యవేక్షిస్తోంది’’ అని కూడా సదరు మెయిల్‌లో చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంపై నిజానిజాలను వెలికితీసిన సైబర్ క్రైమ్ పోలీసులు... పారిఖ్ స్వయంగా ఈమెయిల్ ఐడీలు సృష్టించినట్టు గుర్తించారు. నేరుగా ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకే ఈమెయిల్స్ ద్వారా అధికారులపై ఒత్తిడి తేవాలని పారిఖ్ భావించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 

Updated Date - 2020-11-28T03:47:09+05:30 IST