రోడ్డెక్కితే గానీ జీతాలివ్వరా?

ABN , First Publish Date - 2022-07-01T05:59:52+05:30 IST

జీతాల కోసం ప్రతి నెలా అడుక్కోవాలా? మూడు నెలలకోసారి రోడెక్కి నిరసన తెలిపితేగానీ జీతాలివ్వరా? అంటూ సీనియర్‌ రెసిడెంట్‌(ఎస్‌ఆర్‌) డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

రోడ్డెక్కితే గానీ జీతాలివ్వరా?
సంగారెడ్డిలోని జీజీహెచ్‌ వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు

వేతనాల కోసం సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల ఆందోళన

సంగారెడ్డి జీజీహెచ్‌లో విధులు బహిష్కరణ.. నిరసన

 సంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 30 :  జీతాల కోసం ప్రతి నెలా అడుక్కోవాలా? మూడు నెలలకోసారి రోడెక్కి నిరసన తెలిపితేగానీ జీతాలివ్వరా? అంటూ సీనియర్‌ రెసిడెంట్‌(ఎస్‌ఆర్‌) డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈఎంఐలు టైంకు వస్తున్నాయని, కానీ జీతాలు మాత్రం టైంకు రావడం లేదని మండిపడుతున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పనిచేసే సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు గురువారం ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి అత్యవసర విభాగం వద్దకు వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు అర్వింద్‌సాయి, రాజశేఖర్‌లు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌గా గత నవంబరులో జాయిన్‌ అయ్యామని, నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వేతనాలు మార్చి నెలలో చెల్లించారని, మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు నెలల జీతాలు ఇంకా ఇవ్వాల్సి ఉందన్నారు. నేడు, రేపు జీతాలు వేస్తామంటూ కాలయాపన చేస్తే కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ షిప్‌ కాల పరిమితి ఎప్పుడు అయిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ సమయంలో పరీక్షలు వాయిదా వేసి మరి మూడు నెలలు కొవిడ్‌ డ్యూటీలు చేయించుకున్నారని, ఆ మూడు నెలల కాలవ్యవధిని ఎస్‌ఆర్‌లో పరిగణిస్తామని చెప్పి ఇప్పుడు విస్మరిస్తున్నారని, ఆ మూడు నెలల జీతాలు కూడా ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. జీతాలు చెల్లించే వరకు విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ప్రతినెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌ స్టైఫండ్‌(జీతాలు) వెంటనే చెల్లించాలని లేకపోతే తదుపరి కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ఎస్‌ఆర్‌ల నిరసనకు తెలంగాణ టీచింగ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ గోవింద్‌,  పిడియాట్రిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ షబ్బీర్‌, అనస్తేషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌లు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌లు ఐశ్వర్య, గాయత్రీ, ఆశ, ప్రవీణ, భావన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:59:52+05:30 IST