పాలనలో జగన్ విఫలమవుతారని ఎప్పుడో చెప్పా
ABN , First Publish Date - 2022-07-28T09:02:05+05:30 IST
పాలనలో జగన్ విఫలమవుతారని ఎప్పుడో చెప్పా
కేసీఆర్కు తాగి పడుకోవడం తప్ప ఏమీ తెలియదు
తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాదే ఉండాలి: కేఏ పాల్
భానుగుడి (కాకినాడ), జూలై 27: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనపై అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, మరో శ్రీలంక అయ్యే పరిస్థితులు దాపురించాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. పాలనలో జగన్ విఫలమవుతారని తాను గతంలో చెప్పిన మాట ఇప్పుడు నిజమైందని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్కల్యాణ్ తనతో కలిసి పనిచేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని చెప్పారు. కాకినాడలో జిల్లా పార్టీ నాయకుల సమావేశానికి బుధవారం హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. 13 జిల్లాలను 26 చేసి అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయాలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సెప్టెంబరు 25లోపు తెలంగాణ, ఆంధ్రలో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సాయం ప్రకటించాలని, లేకుంటే తానే ఆర్థిక సహాయం ప్రకటిస్తానని.. అందుకు కేంద్రప్రభుత్వం నిలిపివేసిన తన పాస్పోర్టు, సమిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు ఫాంహౌ్సలో తాగి పడుకోవడం తప్ప ఏమీ తెలియదని, తెలంగాణ నాది అని చెప్పుకొనే ఆయన ముందు ఎక్కడ నుంచి వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఉభయరాష్ట్రాల రాజధానిగా హైదరాబాదే ఉండాలని, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఆ పార్టీ కిసాన్మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్కుమార్తో కలిసి నాయకులు నిరసన తెలిపారు.
అడ్డుకున్న పోలీసులు.. నడుచుకుంటూ వెళ్లి టీ తాగిన పాల్
కేఏ పాల్ బుధవారం ఉదయం సమీక్షా సమావేశానికి గంట ముందుగా వచ్చారు. పార్టీ సభ్యులతో కలిసి టీ తాగేందుకు భానుగుడి సెంటర్కు ర్యాలీగా బయలుదేరారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆయన కారు దిగి నడుచుకుంటూ వెళ్లి టీ తాగి.. ప్రపంచంలో ఇంత చక్కటి టీని ఎక్కడా ఆస్వాదించలేదంటూ కొనియాడారు.