ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు
ABN , First Publish Date - 2021-05-06T08:11:24+05:30 IST
పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించవద్దని, ఒంట్లో ఏ మాత్రం అలసటగా ఉన్నా వెంటనే కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.
- అలసటగా ఉంటే టెస్ట్ చేయించుకోండి
- సిబ్బందికి డీజీపీ మహేందర్రెడ్డి సూచన
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించవద్దని, ఒంట్లో ఏ మాత్రం అలసటగా ఉన్నా వెంటనే కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. పాజిటివ్గా తేలితే మరుక్షణం నుంచే మందులు వాడాలన్నారు. పోలీసులు కరోనాబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. తన కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఆయన కమిషనర్లు, ఎస్పీలతో ఆన్లైన్ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, కొవిడ్ మహమ్మారిని కూడా ఎదుర్కొంటారన్నారు. పాజిటివ్ వచ్చిన సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. అత్యవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులతో మాట్లాడి ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారిపై, భౌతిక దూరం పాటించనివారిపై తప్పకుండా కేసులు నమోదు చేయాలని యూనిట్ అధికారులకు డీజీపీ సూచించారు.