చెడును ఎదిరించడానికి భయపడొద్దు : సీజేఐ జస్టిస్ రమణ

ABN , First Publish Date - 2021-11-26T23:38:45+05:30 IST

మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత

చెడును ఎదిరించడానికి భయపడొద్దు : సీజేఐ జస్టిస్ రమణ

న్యూఢిల్లీ : మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ప్రేరేపిత, లక్షిత దాడుల నుంచి న్యాయ వ్యవస్థను పరిరక్షించాలని కోరారు. చర్చకు అవకాశం కల్పించడం మన రాజ్యాంగ ముఖ్య లక్షణమని చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


న్యాయవాదులు, న్యాయమూర్తులు ఓ పెద్ద కుటుంబంలో భాగమని జస్టిస్ రమణ చెప్పారు. న్యాయమూర్తులకు, వ్యవస్థకు సాయపడాలని న్యాయవాదులను కోరారు. ప్రేరేపిత, లక్షిత దాడుల నుంచి వ్యవస్థను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. మంచికి మద్దతునివ్వడానికి, చెడును వ్యతిరేకించడానికి భయపడకూడదని, అయిష్టతను ప్రదర్శించరాదని చెప్పారు. 


నేడు మనల్ని ఈ విధంగా నిలిపిన స్వాతంత్ర్య సమర యోధులకు, రాజ్యాంగ సభ సభ్యులకు వినయపూర్వకంగా వందనం చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన వర్గంలో  భాగస్వామినైనందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ వర్గం స్వాతంత్ర్యోద్యమంలో గొప్ప కృషి చేసిందని, అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పనలో విశేష పాత్ర పోషించిందని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి రాజ్యాంగానికి ప్రాతిపదికలని, వీటి గురించి అన్ని వర్గాల ప్రజలకు తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతిరాయ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ చేసిన కృషిని మరువలేమని చెప్పారు. 


రాజ్యాంగ ముసాయిదాకు 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదం లభించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-11-26T23:38:45+05:30 IST