పిల్లల ముందు కీచులాటలొద్దు

ABN , First Publish Date - 2021-03-27T05:46:58+05:30 IST

చిన్నారులకు తల్లితండ్రులే మార్గదర్శకులు. నలుగురితో ఎలా మెలగాలి... సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలి... ఇలా వారికి అన్నింటా తొలి గురువులు అమ్మానాన్నలే. కనుక పిల్లల ముందు కీచులాడుతూ ఉంటే అది వారిపై ప్రతికూల ప్రభావం

పిల్లల ముందు కీచులాటలొద్దు

చిన్నారులకు తల్లితండ్రులే మార్గదర్శకులు. నలుగురితో ఎలా మెలగాలి... సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలి... ఇలా వారికి అన్నింటా తొలి గురువులు అమ్మానాన్నలే. కనుక పిల్లల ముందు కీచులాడుతూ ఉంటే అది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. చిన్నారుల సమక్షంలో ఎలా ఉండకూడదు చెబుతున్నారు... 


పరస్పరం విమర్శించుకోవడం: 

చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమను తాము విమర్శించుకొంటుంటారు. అందంగా లేమనో... కెరీర్‌లో ఎదగలేకపోతున్నాననో, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాననో... ఇలా పిల్లల ముందే తమ అసహనాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతుంటారు. ఈ ప్రభావం పిల్లలపై పడి సరైన లక్ష్యాలు నిర్దేశించుకోవడంలో విఫలమవుతారు. ఒత్తిడికి లోనవుతారు. 


ఎవరి మొబైలో వారుండడం: 

స్మార్ట్‌ఫోన్ల యుగం వచ్చాక భార్యాభర్తలు పక్కపక్కనే ఉన్నా ఎవరి లోకంలో వాళ్లు గడుపుతున్నారు. పిల్లలతో సమయం గడపకుండా సామాజిక మాధ్యమాలు, ఛాటింగ్‌లు లేదంటే  ఫోన్‌లో మాట్లాడుతూ కూర్చొంటున్నారు. దీనివల్ల చిన్నారులు  తమకూ గ్యాడ్జెట్స్‌ కావాలని మారాం చేస్తారు. దాంతో చదువు, తిండి తగ్గిపోతాయి. వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఆలోచించడం మొదలుపెడతారు.  


దురలవాట్లను ప్రదర్శించడం: 

చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ వ్యసనాలు, దురలవాట్లను పిల్లల ముందే ప్రదర్శిస్తుంటారు. వారుండగానే మద్యం సేవించడం, పొగ తాగడం వంటివి చేస్తుంటారు. ఇవి చూసి చూసి పిల్లలు కూడా పెద్దలకు తెలియకుండా వాటిని అలవాటు చేసుకొనే ప్రమాదం ఉంది. ఒక్కసారి చెడు వ్యసనాలు అలవాటైతే మాన్పించడం చాలా కష్టం.


వేరొకరితో పోల్చడం: 

అందరి కంటే తమ పిల్లలు అన్నింట్లో ముందుండాలని ప్రతి తల్లీ... తండ్రీ కోరుకోవడం సహజమే. కానీ ఈ ఆలోచన చాలా సందర్భాల్లో చిన్నారులపై ఒత్తిడి పెంచుతుంది. ముఖ్యంగా చదువు విషయంలో తమ పిల్లలను వేరొకరితో పోలుస్తుంటారు. ‘వాడిని చూసి నేర్చుకో’ అంటూ సూటిపోటి మాటలంటారు. ఈ ధోరణి పిల్లలను మానసికంగా తీవ్రంగా కుంగదీస్తుంది. 


వాదనలు వద్దు: 

చిన్నారులు పక్కన ఉన్నా తల్లిదండ్రులు వాదులాటకు దిగుతుంటారు. గొడవను పొడిగించుకొంటూ పోతుంటారు. ఇది చూసి పిల్లలు కూడా వారిలానే ప్రవర్తించడం మొదలుపెడతారు. బడిలో ఆడుకొనే సమయంలోనో, మరో సందర్భంలోనో తమ చెప్పిందే వేదమన్నట్టు మాట్లాడతారు. ఈ ధోరణివల్ల ఎన్నో ఇబ్బందుల కొని తెచ్చుకుంటారు. చిన్న వయసులోనే పిల్లలకు మంచి నడవడిక నేర్పితే అది వారి బంగరు భవితకు బాటలు వేస్తుందనే విషయం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. 

Updated Date - 2021-03-27T05:46:58+05:30 IST