రాజకీయపార్టీలకు కులసంఘాలను తాకట్టు పెట్టొద్దు
ABN , First Publish Date - 2022-01-25T06:55:30+05:30 IST
రాజకీయపార్టీలకు కులసంఘాలను తాకట్టు పెట్టొద్దని బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు స్పష్టం చేశారు.
శ్రీకాళహస్తి, జనవరి 24: రాజకీయపార్టీలకు కులసంఘాలను తాకట్టు పెట్టొద్దని బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షుడి ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంతో పేరున్న సత్రవాడ మునిరామయ్య కుమారుడు సత్రవాడ ప్రవీణ్ ను జిల్లా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఏదైనా ఆర్థికంగా వెనుకబడిన బీసీల ఎదుగుదలకు అందరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఒక్క బీసీ నేత లేడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టుబోర్డు చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘ నూతన అధ్యక్షుడు సత్రవాడ ప్రవీణ్ మాట్లాడుతూ... బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరారవు, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి, బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉమాసింగ్, తులసీరామ్, మాజీ కౌన్సిలర్ జయదేవ్ గిరి తదితరులు పాల్గొన్నారు.