చెట్లనూ వదలడం లేదు!

ABN , First Publish Date - 2021-09-29T06:38:24+05:30 IST

మార్కాపురంలో అధికారపార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ఇప్పటి వరకూ కొండలు, గుట్టలు, వాగుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను తెగబడ్డ వారి కన్ను ఇప్పుడు భారీ వృక్షాలపై పడింది.

చెట్లనూ వదలడం లేదు!
ఎక్స్‌కవేటర్‌తో తరలిస్తున్న తుమ్మ దుంగలు

మితిమీరిన అధికారపార్టీ అక్రమాలు

ఇప్పటివరకూ మట్టి, ఇప్పుడు వృక్షాలు

రూ.25లక్షలకు కలప అమ్మకం

మార్కాపురం, సెప్టెంబరు 28: మార్కాపురంలో అధికారపార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ఇప్పటి వరకూ కొండలు, గుట్టలు, వాగుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను తెగబడ్డ వారి కన్ను ఇప్పుడు భారీ వృక్షాలపై పడింది. పర్యావరణ పరిరక్షణ కోసం గత ప్రభుత్వాలు నాడు పోషించిన చెట్లను తెగనరికి విలువైన కలపను అక్రమంగా అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు వారికే అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


యథేచ్ఛగా చెట్ల నరికివేత

మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో అధికారపార్టీకి చెందిన గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా స్థానిక చెరువులో ఉన్న చెట్లను అమ్మేశాడు. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు గత ప్రభుత్వాలు తుమ్మ చెట్ల పెంపకాన్ని చేపట్టాయి. అవి భారీగా పెరిగాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన  అధికార పార్టీ నాయకుడు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పంచాయతీ తీర్మానం మేరకు వాటిని విక్రయిస్తున్నట్లు రికార్డులు తయారు చేయించారని తెలుస్తోంది. 


కలెక్టర్‌ నోటిఫికేషన్‌ తప్పనిసరి

చెరువులో చెట్లను విక్రయించడానికి నిబంధనల మేరకు కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. తొలుత పంచాయతీలో తీర్మానం చేసి, ఆ కాపీని నీటిపారుదల శాఖాధికారులకు పంపాలి. వారు ఆయా ప్రతిపాదనలను కలెక్టర్‌కు నివేదించాలి. అనంతరం ఆయన నోటిఫికేషన్‌ జారీచేసి అధిక మొత్తంలో టెండర్‌ వేసిన వ్యక్తికి చెట్లను అమ్ముకునేందుకు అనుమతులిస్తారు. కానీ పెద్దనాగులవరంలో నిబంధనలు అమలుకావడం లేదు. 


రూ.25లక్షలతో అనధికారిక ఒప్పందం

సదరు ప్రజాప్రతినిధి మార్కాపురంలోని ఒక టింబర్‌ డిపో యజమానితో రూ.25 లక్షలకు అనధికార ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందుకుగాను చెట్ల నరికివేత, కలప తరలింపు అంతా టింబర్‌ డిపో యజమాని చూస్తున్నాడు. పగలు కూలీలు, మిషనరీలతో చెట్లు నరికివేత, సాయంత్రం 6గంటల తర్వాత కలపను ట్రాక్టర్ల ద్వారా టింబర్‌ డిపోకు తరలిస్తున్నారు.


కన్నెత్తి చూడని అధికారులు

పెద్దనాగులవరం చెరువులో జరుగుతున్న చెట్ల నరికివేత, దుంగల అక్రమ తరలింపు వ్యవహారంపై అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న చెరువులో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఆ శాఖాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై పలు అరోపణలు వ్యక్తమవుతున్నాయి. 




Updated Date - 2021-09-29T06:38:24+05:30 IST