ఎంఎన్ఎస్ హెచ్చరికలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు : అజిత్ పవార్
ABN , First Publish Date - 2022-04-13T18:19:27+05:30 IST
మసీదుల్లో లౌడ్స్పీకర్లను మూసివేయాలని మహారాష్ట్ర నవ
ముంబై : మసీదుల్లో లౌడ్స్పీకర్లను మూసివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే చేసిన హెచ్చరికలకు ప్రాధాన్యం ఇవ్వవద్దని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. సరైన సమయం వచ్చినపుడు తాను కచ్చితంగా సమాధానం చెబుతానన్నారు. ప్రతి ప్రశ్నకు తన వద్ద సమాధానం ఉందన్నారు.
రాజ్ థాకరే మంగళవారం మాట్లాడుతూ, మసీదుల్లోని లౌడ్స్పీకర్లను మే 3నాటికి మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లౌడ్స్పీకర్లను ఆపకపోతే, తాము హనుమాన్ చాలీసాను వినిపిస్తామని చెప్పారు. ఇది సామాజిక సమస్య అని, మతపరమైన సమస్య కాదని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.
దీనిపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్లో, ముంబైలోని కనీసం ఒక మసీదు నుంచి అయినా లౌడ్స్పీకర్ను తొలగిస్తే, అది చాలా తీవ్రమైన సిగ్గు చేటు విషయం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మసీదులో లౌడ్స్పీకర్లను మూసివేయాలనే డిమాండ్ను ఈ మూడు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.