ఆ బిల్లులను ఆమోదించకండి.. ప్లీజ్!
ABN , First Publish Date - 2020-07-14T08:31:20+05:30 IST
పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల
- ఆమోదిస్తే మాతోపాటు అందరికీ చేటే
- రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయండి
- వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై
- గవర్నర్కు అమరావతి రైతుల అభ్యర్థన
- వేలకొద్దీ వినతులు పంపేందుకు సమాయత్తం
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుతోపాటు ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును ఆమోదించరాదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను అభ్యర్థించేందుకు అమరావతి రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని పేర్కొంటున్నారు. అంతేకాదు, సహజ న్యాయసూత్రాలకు సైతం ఈ బిల్లులు విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల వాటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో గవర్నర్కు వేలాది వినతిపత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బిల్లులకు సంబంధించిన పూర్వాపరాలను, ఏయే కారణాల వల్ల అవి నిర్హేతుకమైనవో, దురుద్దేశ పూరితమైనవో వివరిస్తూ రూపొందించుకున్న వీటిని వచ్చే కొద్ది రోజుల్లో గవర్నర్కు పంపాలని నిర్ణయించారు. తద్వారా ఆయన సానుకూలంగా స్పందించి బిల్లులను ఆమోదించకుండా రిజర్వ్లో ఉంచుతారని రైతులు భావిస్తున్నారు.