సీఎం సభకు కరోనా నిబంధనలు వర్తించవా?
ABN , First Publish Date - 2021-04-15T09:13:42+05:30 IST
కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ పాఠశాలలను మూసివేసిన అధికారులు.. సాగర్లో సీఎం కేసీఆర్ సభకు ఎలా అనుమతిచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: భట్టి
మధిరటౌన్, ఏప్రిల్ 14: కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ పాఠశాలలను మూసివేసిన అధికారులు.. సాగర్లో సీఎం కేసీఆర్ సభకు ఎలా అనుమతిచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా మధిరలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో తక్షణమే 144 సెక్షన్ విధించి, కరోనా వ్యాప్తిని అరికట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తే కేసులు పెడతారా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం బలంగా ఉండాలన్నదే అంబేడ్కర్ సిద్ధాంతమని, దురదృష్టం కొద్దీ నేటి పాలకులు దాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. కాగా, మధిరలో ఏర్పాటు చేసిన 11 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి భట్టి ఆవిష్కరించారు.