2024 parliamentary elections: కాంగ్రెస్కు స్టాలిన్ షాక్ ఇచ్చినట్లేనా?
ABN , First Publish Date - 2022-09-16T03:42:34+05:30 IST
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చినట్లు తెలుస్తోంది.
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చినట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. విరుధునగర్లో ఇవాళ జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ డీఎంకేను గెలిపించాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు.
తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 39 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 38 చోట్ల గెలిచింది. ఇందులో 20 చోట్ల పోటీ చేసిన డీఎంకే 20 చోట్లా గెలిచింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు కేటాయిస్తే 8 చోట్ల ఆ పార్టీ అభ్యర్ధులు గెలుపొందారు. పొత్తులో భాగంగా మిగతా మిత్రపక్షాల పార్టీల అభ్యర్ధులూ డీఎంకే వేవ్ వల్ల గెలిచారు. తమకు అంత వేవ్ ఉందని తెలిసి ఉంటే నాడు స్టాలిన్ మిత్రపక్షాలకు అన్ని సీట్లు కేటాయించేవారో తెలియదు కానీ... ఈ సారి స్టాలిన్లో కాన్ఫిడెన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్తో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండకపోవచ్చని స్టాలిన్ తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లేనని రాజకీయ పరిశీలకులంటున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్తో స్టాలిన్కు సత్సంబంధాలున్నాయి. అయితే బీజేపీయేతర కూటమికి కాంగ్రెస్ సారధ్యంపై ఇంకా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 39 స్థానాల్లో మెజార్టీ నియోజకవర్గాలు గెలవడం ద్వారా విపక్షాల ప్రధాని అభ్యర్ధిత్వానికి మార్గం సుగమం చేసుకోవడంలో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది.