రాజ్యసభ ఎన్నికలు.. Dmk అభ్యర్థుల నామినేషన్
ABN , First Publish Date - 2022-05-28T13:01:37+05:30 IST
రాజ్యసభ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. రాష్ట్రంలో జూన్ నెలాఖరున ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
చెన్నై: రాజ్యసభ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. రాష్ట్రంలో జూన్ నెలాఖరున ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. శాసనసభలోని సభ్యుల మెజారిటీ ప్రకారం డీఎంకే కూటమి నాలుగు స్థానాలను సులువుగా గెలిచే అవకాశం ఉంది. అయితే మూడు స్థానాలకు డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. ఒక సీటు మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కేటాయించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అభ్యర్థులు కళ్యాణసుందరం, రాజేష్ కుమార్, గిరిరాజన్ సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు దురైమురుగన్, ఏవీ వేలు, పొన్ముడి, ఎంపీలు టీఆర్ బాలు, కనిమొళి, తిరుచ్చి శివా సమక్షంలో ఎన్నికల అధికారి, శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండు స్థానాల అభ్యర్థుల జాబితాను అన్నాడీఎంకే ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు అన్నాడీఎంకే తరఫున మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ధర్మర్ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వెలువడాల్సివుంది. ఈ సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తీవ్రంగా పోటీపడుతున్నారు.