ఆధిక్యంలో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన డీఎంకే.. సంబరాల్లో పార్టీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-05-02T17:19:52+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

ఆధిక్యంలో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన డీఎంకే.. సంబరాల్లో పార్టీ శ్రేణులు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో మేజిక్ ఫిగర్‌ 117ను దాటేసింది. అటు పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వెనుకంజలో ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం(ఉదయం 11.40 గంటల వరకు) డీఎంకే కూటమి 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అన్నాడీఎంకే కూటమి 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక డీఎంకే సీఎం అభ్యర్థి స్టాలిన్ తాను పోటీ చేస్తున్న కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం స్టాలిన్‌కు 3,199 ఓట్లు పోలైతే.. ఆయన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి ఆది రాజారాంకు 1,445 ఓట్లు పడ్డాయి. దీంతో స్టాలిన్ 1,754 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ఆధారంగా.. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఈసారి డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి. దీంతో ఇప్పటికే తమిళనాడులో డీఎంకే శ్రేణుల సంబరాలు మొదలయ్యాయి. 



Updated Date - 2021-05-02T17:19:52+05:30 IST