వ్యాక్సిన్‌ అనంతరం పక్షవాతం!

ABN , First Publish Date - 2021-01-24T05:57:42+05:30 IST

తాడేపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ నెల 20వ తేదీన కరోనా వాక్సిన్‌ తీసుకున్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.

వ్యాక్సిన్‌ అనంతరం పక్షవాతం!
జీజీహెచ్‌లో బాధితురాలిని పరామర్శిస్తున్న యాస్మిన్‌, రత్న మన్మోహన్‌

అనారోగ్యం పాలైన ఆశా కార్యకర్త

మరో ఇద్దరికి స్వల్ప అస్వస్థత  

గుంటూరు (మెడికల్‌), తాడేపల్లి, టౌన్‌ జనవరి 23: తాడేపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ నెల 20వ తేదీన కరోనా వాక్సిన్‌ తీసుకున్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం తీవ్రమైన పక్షవాతం(బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌) బారిన పడింది. ప్రస్తుతం ఆమో గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి న్యూరాలజీ ఐసీయూలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. 22వ తేదీన పెరాల్సిస్‌ స్ట్రోక్‌కు గురికావడంతో చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌, డీఐవో డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభావతి తదితరులు బాధితులను కలసి పరామర్శించారు. కాగా అదేరోజు వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌ఎం జి.లక్ష్మి స్వల్వ అస్వస్థతకు గురికావడంతో గుంటూరుకు తరలించారు. మెల్లెంపూడికి చెందిన ఆశావర్కర్‌ వరలక్ష్మికి శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. తాడేపల్లి వైద్యాధికారి కిరణ్‌ మాట్లాడుతూ ఇద్దరు సిబ్బంది ఆరోగ్యం మెరుగ్గా ఉందని భయాందోళనలతోనే వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. గుంటూరు పీవోడీటీ పద్మావతి తాడేపల్లి పీహెచ్‌సీకి విచ్చేసి వాక్సిన్‌ తీసుకున్న సిబ్బందికి అవగాహన కల్పించారు.  


Updated Date - 2021-01-24T05:57:42+05:30 IST