దివ్యాంగుల కాలనీలో వసతులు కల్పించాలి
ABN , First Publish Date - 2022-09-27T04:15:25+05:30 IST
పట్టణంలోని ముసునూరు దివ్యాంగుల కాలనీలో రోడ్డు, విద్యుత్, మంచినీరు తదితర వసతులు కల్పించాలని కోరుతూ దివ్యాంగులు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు.
మున్సిపల్ కార్యలయం వద్ద ధర్నా
కావలి, సెప్టెంబరు 26: పట్టణంలోని ముసునూరు దివ్యాంగుల కాలనీలో రోడ్డు, విద్యుత్, మంచినీరు తదితర వసతులు కల్పించాలని కోరుతూ దివ్యాంగులు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి మండవ వెంకట్రావు మాట్లాడుతూ కాలనీలో రోడ్లు లేక వర్షాలు కురిస్తే ముంపునకు గురవుతోందన్నారు. దీంతో నడవాలన్నా, ట్రైసైకిళ్లు తిరగాలన్నా దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు లేక వీధిలైట్లు వెలగడం లేదని, తాగునీటి సరఫరా లేదన్నారు. సమస్యలు తెలుపుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వస్తే కనీసం మా వద్దకు వచ్చి వినే వారులేరని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే దివ్యాంగుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. చివరకు మున్సిపల్ మేనేజరుకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చామన్నారు.