దివ్యాంగులు ప్రతిభావంతులు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-04T05:37:02+05:30 IST

దివ్యాంగులు.. ప్రతిభావంతులని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

దివ్యాంగులు ప్రతిభావంతులు: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

    కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3: దివ్యాంగులు.. ప్రతిభావంతులని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. వారు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగులతో గడపడం ఆనందంగా ఉందన్నారు. అన్నీ ఉన్నా ఏమీ చేయని వారు నిజమైన వికలాంగులని, దివ్యాంగులైనా.. ఒక లక్ష్యంతో పని చేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. త్వరలో విభిన్న ప్రతిభావంతులకు జిల్లాలో 11 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. అన్ని శాఖలలో వారి కోసం రోస్టర్లను వెరిఫై చేయిస్తామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 73 వేల మంది విభిన్న ప్రతిభావంతులు ఉంటే.. ఇందులో 48,500 మందికి ప్రతి నెలా 14.54లక్షలు పింఛన్‌ ఇస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతుల జీవనోపాధికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామన్నారు. డిజేబుల్డ్‌ హాస్టల్‌ నిధులు రాగానే పూర్తి చేయిస్తామన్నారు. సోలో డ్యాన్స్‌, గ్రూప్‌ డ్యాన్స్‌, పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ల్యాప్‌ట్యాప్‌లు, టచ్‌ స్కీన్‌ మొబైల్‌లు, చెవిటి వినికిడి యంత్రాలను కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏడీ విజయ, మెప్మా పీడీ రాధికరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాసులు, జీజీహెచ్‌ ఆర్‌ఎంవో వసుధ తదితరులు పాల్గొన్నారు.

    Updated Date - 2021-12-04T05:37:02+05:30 IST