ఇరుకు రోడ్డులో డివైడర్లు

ABN , First Publish Date - 2020-07-06T10:30:01+05:30 IST

రహదారులు విస్తరించి, డివైడర్లు నిర్మించి ప్రజలకు సౌకర్యం కలిగించాల్సింది పోయి, ఉన్న ఇరుకురోడ్డును పూర్తిగా బీటీ చేయకుండా, విస్తరించకుండా అడ్డగోలుగా డివైడర్లు నిర్మించటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర

ఇరుకు రోడ్డులో డివైడర్లు

రహదారి విస్తరించకుండానే నిర్మాణాలు

సీసీ, బీటీ పనులు పూర్తి కాలేదు

కరెంటుస్తంభాలు తొలగించలేదు


ఖమ్మం కార్పొరేషన్‌, జూలై 5: రహదారులు విస్తరించి, డివైడర్లు నిర్మించి ప్రజలకు సౌకర్యం కలిగించాల్సింది పోయి, ఉన్న ఇరుకురోడ్డును పూర్తిగా బీటీ చేయకుండా, విస్తరించకుండా అడ్డగోలుగా డివైడర్లు నిర్మించటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.  డివైడర్లు నిర్మించేటప్పుడు రహదారి మధ్యలో కరెంటు స్తంభాలు కూడా తొలగించలేదు. ప్రణాళిక లేకుండా డివైడర్లు నిర్మించటంతో రహదారి మరీ ఇరుకు కావటంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు మట్టిరోడ్డులో దిగబడుతున్నాయి. నగరంలోని 45వ డివిజన్‌లో ఈ పరిస్థితి నెలకొంది. నగరంలోని హిందూ శ్మశాన వాటిక నుంచి గ్రెయిన్‌మార్కెట్‌కు వెళ్లే రహదారిని కొంతమేర 60 అడుగులు, మరికొంతమేర 100 అడుగుల రహదారిగా మార్చాలని ప్రతిపాదనలు చేశారు. దీనిలో భాగంగా డివైడర్లు కూడా నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం నగరపాలక సంస్థ నిధులు రూ.1.70 కోట్లు కేటాయించి, టెండర్లు నిర్వహించారు.


ఈ రహదారి గుండానే గ్రెయిన్‌మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తరలిస్తుంటారు. అంతేకాకుండా భారీ వాహనాలు ఈ రహదారి ద్వారానే వెళతాయి. అందుకే రహదారి విస్తరించి, డివైడర్తు నిర్మించాలని తీర్మానం చేశారు. రహదారి విస్తరణకోసం మార్కింగులు కూడా పెట్టారు. అయితే ప్రస్తుతం ఉన్న 50 అడుగుల రహదారిని అభివృద్ధి చేస్తే సరిపోతుందని స్థానికులు కొందరు కోర్టును ఆశ్రయించటంతో వారికి అనుకూలంగా తీర్పువచ్చింది. అయితే సగం వేసిన రహదారిని అభివృద్ధి చేయకుండా డివైడర్లు నిర్మించటం కష్టాలకు దారితీసింది.


నిరుపయోగంగా నిధులు

రహదారి అభివృద్ధికి నిధులు కేటాయించినా, కేవలం తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్త్తవంగా ప్రస్తుతం ఉన్న 50 అడుగుల రహదారిలో 10 అడుగుల మేర మాత్రమే సీసీ వేశారు. మిగతాది మట్టిరహదారిగా ఉంచారంటే అధికారుల నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రహదారిని అభివృద్ధి చేయకుండా విస్తరణకు, డివైడర్ల నిర్మాణానికి రూ.1.70కోట్లు కేటాయించారు. నిధులున్నా అవి నిరుపయోగంగా మారాయి.


డివైడర్లు నిర్మించారు..

సిమెంట్‌ కాంక్రీటును రోడ్డుపై పూర్తిగా వేయకుండానే డివైడర్లు నిర్మించారు. దీంతో రహదారి మరీ ఇరుకుగా మారింది. కొంతమేర మాత్రమే సీసీ రహదారి ఉండటంతో వాహనాలు మట్టిలో దిగబడుతున్నాయి. డివైడర్లు నిర్మాణం నాసిరకంగా ఉండటంతో లారీల వంటి భారీవాహనాలు ఢీకొని ధ్వంసం అవుతున్నాయి. ఇది మరీ సమస్యగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, 50 అడుగుల మేరా సీసీ రహదారి నిర్మించాల్సి ఉంది.

Updated Date - 2020-07-06T10:30:01+05:30 IST