రాష్ట్రంలో కలవరం
ABN , First Publish Date - 2022-01-08T07:47:28+05:30 IST
నిన్న మొన్నటి వరకు వందల్లో నమోదైన కరోనా కేసులు
- కొత్తగా 840 మందికి పాజిటివ్
- 4 రోజుల్లోనే ఏడు రెట్లు పెరుగుదల
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు వందల్లో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,849 శాంపిల్స్ను పరీక్షించగా.. 840 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో 122 కరోనా కేసులు మాత్రమే నమోదవగా.. నాలుగు రోజుల్లోనే దాదాపు ఏడు రెట్లు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా మూడు వేలకు చేరుకున్నాయి.
తాజాగా విశాఖపట్నంలో 183, చిత్తూరులో 150, కృష్ణాలో 88, తూర్పుగోదావరిలో 70, నెల్లూరులో 69, గుంటూరులో 66, విజయనగరంలో 49 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 20,79,763కి, మరణాల సంఖ్య 14,501కి పెరిగింది. కాగా, రెవెన్యూ శాఖ పరిధిలోని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఓ సీనియర్ అధికారి కరోనా బారినపడ్డారు. వైద్యపరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది.