నెలాఖరుకు గ్రీన్ జోన్లోకి జిల్లా
ABN , First Publish Date - 2021-06-15T05:23:11+05:30 IST
జిల్లాలో పక్కాగా కొవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టి, ఈనెలాఖరు నాటికి జిల్లాను గ్రీన్ జోన్లోకి తీసుకెళ్తామని కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సోమవారం ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.
థర్డ్ వేవ్ను ఎట్టి పరిస్థితుల్లో దరిచేరనీయొద్దు
ఎన్జీవోలతో వర్చువల్ సమావేశంలో కలెక్టర్ హరిజవహర్లాల్
కలెక్టరేట్, జూన్ 14: జిల్లాలో పక్కాగా కొవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టి, ఈనెలాఖరు నాటికి జిల్లాను గ్రీన్ జోన్లోకి తీసుకెళ్తామని కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సోమవారం ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు దశల్లో కొవిడ్ నియంత్రణకు పటిష్ట కార్యచరణ రూపొందించామని చెప్పారు. ఽథర్డ్ వేవ్ను ఎట్టి పరిస్థితిలో దరి చేరనీయొద్దని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపై ఉందన్నారు. లక్షణాలు కన్పించిన వారిని వెంటనే హోం ఐసోలేషన్కు పంపించాలని సూచించారు. ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిదని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి కరోనా వచ్చినా వెంటనే హోం ఐసోలేషన్లోకి వెళ్లాలన్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకోవాలని , ఎవరికి వారే వైద్యులుగా మారాలని సూచించారు. వ్యాక్సిన్పై అపోహలు వద్దని, ప్రతి కూల ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని చెప్పారు. థర్డ్ వేవ్ విజృంభించకుండా మూడంచెల వ్యూహాలను అనుసరించాలన్నారు. థర్డ్ వేవ్లో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలులేదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా మెలగాలని కలెక్టర్ సూచించారు. జేసీ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ జిల్లాలో సుమారు నాలుగు లక్షలు మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వ్యాక్సిన్ చేయించుకున్న వారిలో ప్రాణాపాయం చాలా తక్కువని తెలిపారు. ఎన్జీవో సభ్యులు మండల స్థాయిలో ఉన్న నోడల్ అధికారులతో సమన్వయంగా ఉంటూ కొవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో ఎస్జీవో సభ్యులు గుర్తింపు కార్డులు అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్, జిల్లా యూత్ కో ఆర్డినేటర్ విక్రమాదిత్య తదితరులు ఉన్నారు.