కేసుల్లో జిల్లా ప్రథమం

ABN , First Publish Date - 2021-05-12T07:13:53+05:30 IST

జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 2426 కరోనా పాజిటివ్‌ కేసులు, 18 మరణాలూ నమోదయ్యాయి.

కేసుల్లో జిల్లా ప్రథమం

 2426 కేసులు... 18 మరణాలు


తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 2426 కరోనా పాజిటివ్‌ కేసులు, 18 మరణాలూ నమోదయ్యాయి.తాజా కేసులతో కేసుల సంఖ్య 143906కు చేరుకోగా మంగళవారం ఉదయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 21636కు చేరింది. ఇక మరణాలు 1056కు చేరాయి.తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 294, చిత్తూరులో 178, మదనపల్లెలో 163, పలమనేరులో 140, తిరుపతి రూరల్‌లో 109, శ్రీకాళహస్తిలో 101, కుప్పంలో 79, పుంగనూరులో 77, పెద్దపంజాణిలో 75, పూతలపట్టులో 68, రేణిగుంటలో 66, గంగవరంలో 62, ములకలచెరువులో 59, పాకాలలో 56 వంతున నమోదయ్యాయి.  


మూడురోజుల వ్యవధిలో తల్లీకొడుకుల మృతి

సోమల మండలం వలిగట్ల పంచాయతీ పుట్టవారిపల్లెకు చెందిన డీలర్‌ మోహన్‌రెడ్డి (56) సోమవారం సాయంత్రం కొవిడ్‌తో తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయారు. మూడు రోజుల కిందట ఆయన తల్లి రుక్మిణమ్మ కూడా కరోనా కారణంగానే మరణించిన సంగతి తెలిసిందే. 


కరోనాతో ఇద్దరు టీచర్ల మృతి 

పుంగనూరుకు చెందిన చరణ్‌కుమార్‌ (43) పెద్ద అలసాపురంలోని ప్రాధమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు. కరోనా సోకడంతో బెంగళూరులో చికిత్స తీసుకుని కోలుకుని ఇంటికి చేరుకున్నారు.మళ్లీ అస్వస్థతకు లోను కావడంతో మంగళవారం ఉదయం కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు. వెదురుకుప్పం మండలానికి చెందిన యాగమూర్తి (59) చిన్న బొమ్మయ్యపల్లె ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు.కరోనాతో రుయాలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు.

Updated Date - 2021-05-12T07:13:53+05:30 IST