దిశ కేసును TG హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2022-05-20T18:35:32+05:30 IST
దిశా ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ జరిపింది.
న్యూఢిల్లీ: దిశా ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ జరిపింది. దిశా ఎన్కౌంటర్ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్ కాపీ రూపంలో కేసులోని ఇరువర్గాల వారికి పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుకోవాలని కేసులోని అందరికి సుప్రీం అవకాశం ఇచ్చింది. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొన్న అనంతరం విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపించింది.
కాగా... దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసుపై ఈరోజు ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐని లాయర్ శ్యామ్దివాన్ కోరారు. అయితే సిర్పూర్కర్ నివేదికలో గోప్యం ఏమి లేదని.. దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ మేం కమిషన్ వేశాం..కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుంది. దానికి అనుగుణంగా ముందుకెళ్తాము’’ అని తెలిపారు. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ అన్నారు. అయితే నివేదికను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టొద్దని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని... ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ తేల్చి చెప్పారు. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ను హైకోర్టుకు పంపిస్తామని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు.