దుర్గగుడిలో అపచారం
ABN , First Publish Date - 2022-04-28T07:20:30+05:30 IST
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో
- అమ్మవారి ఆలయంలో రామ్చరణ్ అభిమానుల అత్యుత్సాహం
- చెప్పులు, బూట్లతో ముఖమండపంలోకి దూసుకొచ్చిన వైనం
- రామ్చరణ్కు స్వాగతం పలికేందుకు వచ్చిన ఈవో తోసివేత
- తొక్కిసలాటలో రెయిలింగ్ రాడ్లు, పూలకుండీలు ధ్వంసం
- హుండీలపైకి ఎక్కి మూలవిరాట్ ఫొటోలు, వీడియోల చిత్రీకరణ
- దుర్గమ్మ సన్నిధిలో జై చరణ్.. జైజై చరణ్ నినాదాలు
- చేతులెత్తేసిన పోలీసులు... అడుగడుగునా భద్రతా వైఫల్యం
విజయవాడ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. సినీనటుడు రామ్చరణ్ బుధవారం ఉదయం 11.15గంటలకు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. భారీసంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు రామ్చరణ్ కొండపైకి చేరుకోగానే హద్దులు దాటి ప్రవర్తించారు. అమ్మవారి ఆలయంలో ‘జై చరణ్.. జైజై చరణ్’ అంటూ నినాదాలు చేస్తూ వీరంగం చేశారు. రామ్చరణ్కు స్వాగతం పలికేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో భ్రమరాంబను సైతం పక్కకు తోసేశారు. అభిమానులను కట్టడి చేయడంలో ఆలయ భద్రతా సిబ్బందితో పాటు ప్రత్యేక భద్రతా దళాలు, పోలీసు బలగాలు ఘోరంగా విఫలమయ్యాయి.
కొందరు అభిమానులు చెప్పులు, బూట్లతో సహా ముఖమండపంలోకి వచ్చేశారు. రామ్చరణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన సమయంలో అభిమానులు పోటీలు పడుతూ హుండీలపైకి ఎక్కి మరీ మూలవిరాట్ను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. రామ్చరణ్ అంతరాలయంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అభిమానులంతా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగి క్యూలైన్ల రెయిలింగ్ రాడ్లు విరిగిపోయాయి. పూలకుండీలు ధ్వంసమయ్యాయి.