కలికిరిలో లాక్డౌన్ అమలుపై తర్జనభర్జన
ABN , First Publish Date - 2021-09-29T06:30:00+05:30 IST
కలికిరి మండల పరిధిలో లాక్డౌన్ అమలుకు మండల టాస్క్ఫోర్స్ కమిటీ తర్జనభర్జన పడుతోంది.
కలికిరి, సెప్టెంబరు 28: మండల పరిధిలో లాక్డౌన్ అమలుకు మండల టాస్క్ఫోర్స్ కమిటీ తర్జనభర్జన పడుతోంది. కరోనా కేసుల నమోదులో జిల్లాలో మొదటి, రెండు స్థానాల్లో కలికిరి నిలవడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో మంగళవారం జిల్లా అధికారులు స్థానిక టాస్క్ఫోర్స్ కమిటీని అప్రమత్తం చేశారు. కఠిన నిర్ణయానికి రావాల్సిందిగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఆ మేరకు.. లాక్డౌన్ అమలు మినహా గత్యంతరం లేదని వైద్యశాఖ అధికారులు రాతమూలకంగా పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందనీ, కొవిడ్ కట్టడికి తీసుకున్న చర్యలతో పెద్దగా ఉపయోగం కన్పించడం లేదన్న వాదన వెల్లువెత్తింది. కరోనా అడ్డుకట్టకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. మరో రెండురోజులు వేచి చూద్దామంటూ లాక్డౌన్ నిర్ణయాన్ని వాయిదా వేశారు. మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె, అద్దవారిపల్లె పంచాయతీలను కంటోన్మైంట్ జోన్లుగా ప్రకటించారు. సమావేశంలో తహసీల్దారు రమణి, ఎంపీడీవో వెంకటేశులు, వైద్యాధికారి చిన్నరెడ్డెప్ప, ఈవోపీఆర్డీ అబ్దుల్కలామ్ తదితరులు పాల్గొన్నారు.