పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయండి: ఆపస్
ABN , First Publish Date - 2021-04-19T06:57:18+05:30 IST
పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి.. 2018 జూలై ఒకటో తేదీనుంచి అమలుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్కుమార్, బాలాజీ కోరారు.
తిరుపతి(విద్య), ఏప్రిల్ 18: పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి.. 2018 జూలై ఒకటో తేదీనుంచి అమలుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్కుమార్, బాలాజీ కోరారు. సంఘ రాష్ట్ర కార్యవర్గ వర్చువల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకూ ఒక హెచ్ఎం పోస్టు మంజూరు చేయాలని, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, విద్యాశాఖలో యాప్స్ వినియోగం తగ్గించి, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలకు సాధ్యమైన మార్గాలపై వర్క్షాపు నిర్వహించి తగుమార్గాలు సూచించాలని, 17 నెలలుగా ఆగిపోయిన నెలవారీ పదోన్నతులను వెంటనే చేపట్టాలని తీర్మానించారు. అలాగే 20వేలకుపైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే డీఎస్సీ ప్రకటించాలని, నాడు-నేడు రెండో దశపనులను పంచాయతీరాజ్, ఆర్అండ్బీకి అప్పగించి హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఇవ్వాలని, బోధనేతర పనుల నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని, జగనన్న స్మార్ట్సిటీలలో ఉద్యోగులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని, కొవిడ్ బారిన పడిన టీచర్లకు వేతనంతో కూడిన 15రోజుల సెలవును మంజూరు చేయాలని తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్జీ, ఏబీఆర్ఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షుడు పాలేటి వెంకటరావు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.