డోర్ డెలివరీలో డొల్లతనం బహిర్గతం
ABN , First Publish Date - 2020-08-10T11:20:51+05:30 IST
ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమయిన ‘గుండ్లూరు ఇసుక మాయ(ం)’ కథనం దుమారం రేపింది.
దుమారం రేపిన గుండ్లూరు ఇసుక టిప్పర్ మాయాజాలం
కలికిరి, ఆగస్టు 9: ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమయిన ‘గుండ్లూరు ఇసుక మాయ(ం)’ కథనం దుమారం రేపింది.ఇసుక డోర్ డెలివరీలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆదివారం ఉదయాన్నే స్థానిక మీడియాను పోలీసు స్టేషనుకు రప్పించి ఫోన్ కాన్ఫరెన్సు ద్వారా వివరణ ఇచ్చారు. పీలేరు వినియోగదారుడికి ఇసుక చేరవేసేందుకు ఉద్దేశించిన టిప్పర్కు సరైన రికార్డులు లేనందువల్ల దాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.ఈ వివరణ టిప్పర్ వ్యవహారంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. సోమవారం నాటి టిప్పర్ డెలివరీ మెసేజీలకు సంబంధించిన వాస్తవాలను అటుంచితే... మంగళవారం ఉదయం రికార్డులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు సిబ్బంది మేడికుర్తి వద్ద అటకాయించి స్థానిక పోలీసుల స్వాధీనం చేశారు. పీలేరు వినియోగదారుడికి చేరాల్సిన టిప్పర్ (ఏపీ16 టీహెచ్ 4377) ఇదేనని డీఎస్పీ చెప్పారు.అయితే సోమవారమే వినియోగదారుడికి ఇసుక డెలివరీ చేసేశామని ఓటీపీ నెంబరు డ్రైవరుకు ఇవ్వాలని మెసేజీలో పేర్కొన్నారు.
కాబట్టి మంగళవారం తరలిస్తున్న టిప్పరు ఇదేనని ఏపీఎండీసీ అధికారులు చెపుతున్నది బుకాయింపుగా స్పష్టమవుతోంది. కాగా తన ఒకే ఒక ట్రాన్సిట్ పర్మిట్ ఆధారంతో సోమవారం నాలుగు ట్రిప్పులు అదే టిప్పర్తో తరలించి అమ్ముకున్నారని వినియోగదారుడు కృష్ణా రెడ్డి ఆరోపించారు. తరువాత అదే పర్మిట్తో మంగళవారం తరలిస్తుండగా పట్టుబడ్డారని వివరించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తనకు రూ.12 వేలకే చేర్చాల్సి వుందని, అదే బయట రూ.20 వేల వంతున అమ్ముకున్నారని చెప్పారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు.దీనిపై పూర్తిగా విచారణ జరిపితే డోర్ డెలివరీలో జరుగుతున్న లోగుట్టు వ్యవహారాలన్నీ బహిర్గతమవుతాయంటున్నారు.