పోలీసు అధికారులై ఉండి.. భయపడ్డామని చెప్పడమేంటి?.. దిశ ఎన్‌కౌంటర్ నాటి ఘటనపై NHRC ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2021-09-29T09:28:43+05:30 IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలంలో పూర్తి వివరాలెందుకు సేకరించలేదని జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం చీఫ్‌, డీఐజీ మంజిల్‌ సైనీని విచారణ కమిషన్‌ ప్రశ్నించింది.

పోలీసు అధికారులై ఉండి.. భయపడ్డామని చెప్పడమేంటి?.. దిశ ఎన్‌కౌంటర్ నాటి ఘటనపై NHRC ప్రశ్నల వర్షం

దిశ నిందితుల వివరాలెందుకు సేకరించలేదు!

వారి ఎన్‌కౌంటర్‌ ఫొటోలెందుకు తీయలేదు

ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం చీఫ్‌కు కమిషన్‌ ప్రశ్నలు


హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలంలో పూర్తి వివరాలెందుకు సేకరించలేదని జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం చీఫ్‌, డీఐజీ మంజిల్‌ సైనీని విచారణ కమిషన్‌ ప్రశ్నించింది. పోలీస్‌ ఉన్నతాధికారికి ఘటనా స్థలంలో ఏం చేయాలో కూడా తెలియదా? అని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రాంగణంలోని విచారణ కమిషన్‌ కార్యాలయంలో మంగళవారం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ జరిగింది. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం చీఫ్‌, డీఐజీ మంజిల్‌ సైనీ వాంగ్మూలాన్ని కమిషన్‌ నమోదు చేసింది. ‘‘ఘటనా స్థలం స్కెచ్‌ను ఎందుకు గీయలేదు? మృతదేహాల ఫొటోలను ఎందుకు తీయలేదు?’’ అని ప్రశ్నించింది. ఘటనా స్థలంలో ఎక్కువమంది ప్రజలు ఉన్నారని, తమపై దాడి చేస్తారనే భయంతోనే స్కెచ్‌ను గీయలేదని, ఫొటోలు తీయలేదని కమిషన్‌కు మంజిల్‌ వివరించారు. ‘‘మీరంతా పోలీసు అధికారులే. ఘటనా స్థలంలో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఉంది. పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలీసు అధికారులై ఉండి.. భయపడ్డామని చెప్పడమేంటి?’’ అని కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాయపడిన ఇద్దరి పోలీసు అధికారుల వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. వారు విచారణకు సహకరించలేని స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారని మంజిల్‌ వివరించారు. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ త్యాగి వాంగ్మూలాన్ని విచారణ కమిషన్‌ నమోదు చేసింది. మిగిలిన బృంద సభ్యులతోపాటు సైబరాబాద్‌ అప్పటి సీపీ వీసీ సజ్జనార్‌ బుధవారం విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-09-29T09:28:43+05:30 IST