దిండివనం రైల్వేస్టేషన్‌లో కిలో బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-03T18:08:38+05:30 IST

దిండివనం రైల్వేస్టేషన్‌లో సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న కిలో బంగారం ఆభరణాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం జిల్లాలోని దిండివనం రైల్వేస్టేషన్‌లో రైల్వే

దిండివనం రైల్వేస్టేషన్‌లో కిలో బంగారం స్వాధీనం

అడయార్‌(Chennai): దిండివనం రైల్వేస్టేషన్‌లో సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న కిలో బంగారం ఆభరణాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం జిల్లాలోని దిండివనం రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో చెన్నై నగరంలోని షావుకారు పేటకు చెందిన దీపక్‌ దయాలాల్‌ సోని (43) అనే నగల వ్యాపారి దిండివనంలోని ఒక నగల దుకాణానికి బంగారు నగలు సరఫరాచేసి, మిగిలిన నగలను తీసుకుని చెన్నైకు వచ్చేందుకు స్టేషన్‌కు వచ్చారు. ఆయన వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో 1.01 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించి, వాటికి తగిన పత్రాలు చూపించాలని కోరారు. అయితే, తాను బంగారు వ్యాపారం చేస్తున్నానని, దిండివనంలోని ఓ వ్యాపారికి కొన్ని నగలు సరఫరా చేసి మిగిలిన నగలను వెంట తీసుకెళుతున్నట్టు చెప్పారు. అయితే, రైల్వే పోలీసులు ఆయన మాటలు పట్టించుకోకుండా, ఆ నగలను స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత రూ.2.84 లక్షల అపరాధం చెల్లించిన తర్వాత ఆ నగలను ఆదాయపన్ను శాఖ తిరిగి అప్పగించింది. ఈ నగల విలువ మొత్తం రూ.48 లక్షలని ఐటీ అధికారులు వెల్లడించారు. 


Updated Date - 2021-11-03T18:08:38+05:30 IST