Chennai: చిన్నమ్మకు మా మద్దతు

ABN , First Publish Date - 2021-10-24T16:05:37+05:30 IST

త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న వీకే శశికళకు తాము ఘన స్వాగతం పలుకుతామని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నాయకుడు టీటీవీ దినకరన్‌ ప్రకటించారు. దుష్టశక్తులనుంచి అన్నాడీఎంకే విము

Chennai: చిన్నమ్మకు మా మద్దతు

- దారిపొడవునా స్వాగతం పలుకుతాం

- దినకరన్‌ ప్రకటన


చెన్నై: త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న వీకే శశికళకు తాము ఘన స్వాగతం పలుకుతామని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నాయకుడు టీటీవీ దినకరన్‌ ప్రకటించారు. దుష్టశక్తులనుంచి అన్నాడీఎంకే విముక్తి కోసం ఆమె నిర్వహించే ఉద్యమానికి  తమ పార్టీ అండగా వుంటుందని తెలిపారు. అన్నాడీఎంకేకు పూర్వవైభవం కల్పిస్తామంటూ ప్రకటించిన శశికళ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దినకరన్‌ శనివారం ఓ ప్రకటన జారీ చేస్తూ వచ్చేవారం శశికళ తంజావూరు, మదురై జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారని, ఆ సందర్భంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలుకుతారని తెలిపారు. శశికళ ఈనెల 27న చెన్నై నుంచి బయల్దేరి తంజావూరు చేరుకుంటారు. అక్కడ దినకరన్‌ కుమార్తె పెళ్ళి రిసెప్షన్‌ వేడుకల్లో ఆమె పాల్గొంటారు. ఆ తర్వాత 28న ఆమె మదురై జిల్లాల్లో పర్యటించనున్నారు. 29న రామనాథపురం జిల్లా పసుంపోన్‌ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగ దేవర్‌ స్మారక మందిరానికి వెళ్ళి నివాళులర్పించనున్నారు. తంజావూరు, మదురై, రామనాథపురం జిల్లాల్లో పలుచోట్ల ఆమె అన్నాడీఎంకే స్థానిక శాఖ నాయకులను, కార్యకర్తలను కలుసుకోనున్నారు. కొన్నిచోట్ల సమావేశాల్లో పాల్గొంటారు. ఈ మూడు జిల్లాల్లో శశికళ పర్యటించేటప్పుడు లక్షలాది మంది ఏఎంఎంకే కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలుకుతారని దినకరన్‌ తెలిపారు. అన్నాడీఎంకేని దుష్టశక్తుల నుంచి విముక్తి కలిగించే దిశగా శశికళ చేపట్టే అన్ని చర్యలకు తమ పార్టీ గట్టి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

Updated Date - 2021-10-24T16:05:37+05:30 IST